‘బ్రహ్మోత్సవం’ వంటి భారీ ఫ్లాప్ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న “స్పైడర్” సినిమా కోసం నిరీక్షిస్తున్న అభిమానులు, ప్రస్తుతం రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న నేపధ్యంలో… తాజాగా రుమేనియాలో చిత్రీకరణ జరుపుకుంటున్న చివరి పాట కూడా పూర్తయ్యింది. దీంతో ఇక విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి. తాజా ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు సెప్టెంబర్ 10వ తేదీ నాటికల్లా “స్పైడర్” సెన్సార్ కూడా పూర్తి కావచ్చని టాక్.
సినిమా విడుదలపై ఎలాంటి సందేహాలు లేకపోయినా, పబ్లిసిటీ కార్యక్రమాలలో మాత్రం ఇంతవరకు స్పష్టత లేకపోవడం విశేషం. సెప్టెంబర్ 9వ తేదీన కోలీవుడ్ లో గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేయగా, లేటెస్ట్ న్యూస్ ప్రకారం అది జరగడం లేదని తెలుస్తోంది. అయితే ఆ రోజున తమిళ ఆడియోను మాత్రం ఖచ్చితంగా విడుదల చేయనున్నారని, అదే రోజున గానీ లేక మరుసటి రోజున గానీ తెలుగు ఆడియోను విడుదల చేయనున్నారని సమాచారం. ఇక సినిమాకు కీలకమైన ధియేటిరికల్ ట్రైలర్ ను సెప్టెంబర్ 16 లేక 17 తేదీలలో ఓ భారీ ఈవెంట్ తో విడుదల చేయాలని భావిస్తున్నారట.
ఈ రెండు తేదీలలో ఇంకా ఏది ఫైనల్ కాలేదు గానీ, వెన్యూ మాత్రం శిల్పకళావేదికలో జరగనుందని, ఇందుకు టాలీవుడ్, కోలీవుడ్ అతిరధ మహారధులు హాజరు కావచ్చని, భారీ స్థాయిలో ఈ ఈవెంట్ ఉండబోతుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అక్కడ నుండి ప్రిన్స్ మహేష్ బాబుతో సహా చిత్ర యూనిట్ మొత్తం తెలుగు, తమిళంలలో మీడియా మీట్ లు ఏర్పాటు చేసి ప్రమోషన్ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళే విధంగా ప్లానింగ్ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనినంతటిని అధికారికం చేస్తే అభిమానులకు ఫుల్ క్లారిటీ ఇచ్చిన వారవుతారు.


