ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద “అర్జున్ రెడ్డి” సినిమా హవా కొనసాగుతోంది. యూత్ మొత్తం ఫిదా అయిన ఈ సినిమాపై సినీ విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ఆ మాటకొస్తే సినీ విమర్శకులే కాదు, సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను చూసిన తర్వాత తమ భావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇప్పటికే సమంతతో సహా చాలామంది సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచగా, తాజాగా మంచు లక్ష్మి “అర్జున్ రెడ్డి” సినిమా గురించి ప్రస్తావించారు.
“అర్జున్ రెడ్డి” హ్యంగోవర్ లో ఉన్నానని, ‘కల్ట్ క్లాసిక్’గా మారిపోతుందని, మళ్ళీ ఈ సినిమాను చూడాలని అనుకుంటున్నానని, అయితే ఈ సారి మాత్రం అన్ సెన్సార్డ్ మూవీ చూడాలనుకుంటున్నానని, మోడ్రన్ దేవదాసుగా ఉందని… సినిమాపై ప్రశంసలు కురిపించింది. ఈ సినిమా సెన్సార్ విషయంలో హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సంచలనం కావడంతో, సినిమాలో ‘సెన్సార్’ అయిన డైలాగ్స్ పట్ల వీక్షకులు కాస్త ఎక్కువగానే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
నిజానికి లక్ష్మి ప్రసన్న చేసిన వ్యాఖ్యలనే చాలామంది సినీ ప్రేక్షకులు కూడా వ్యక్తపరిచారు. ఏమోషనల్ సన్నివేశాలలో ఇలాంటివి సర్వ సహజం అనిపించే విధంగా ఉన్నాయే తప్ప, అవి వల్గర్ గా లేవన్న భావన ఇంతకుముందే వ్యక్తమయ్యింది. బహుశా ఇలాంటి ప్రేక్షకుల కోసేమోనేమో గానీ, నెట్ లో అన్ సెన్సార్డ్ కాని వీడియో ఒకటి సందడి చేస్తోంది. ఇది పూర్తి సినిమా కాదు గానీ, ఓ నిముషం పాటు సాగే సన్నివేశంలో ‘సెన్సార్’ బోర్డు మ్యూట్ చేసిన పదం ఈ వీడియోలో స్పష్టంగా వినపడుతోంది.


