మంచు కుటుంబం ఇంతవరకు మంచి కుటుంబంలా ఉండేది. కానీ ఇప్పుడు మోహన్ బాబు, మనోజ్, విష్ణుల మద్య గొడవలు కొట్టుకొని పరస్పరం పోలీసులకు పిర్యాదులు చేసుకునే స్థాయికి చేరుకున్నాయి. కనుక వారి కుటుంబ వ్యవహారం బహిరంగం అయ్యింది.
మోహన్ బాబు, మనోజ్, విష్ణు ముగ్గురూ కూడా మీడియాకు తమ గొడవల గురించి చెప్పుకోవడంతో వారే మీడియాని స్వయంగా ఆహ్వానించిన్నట్లయింది.
ఈ గొడవలతో తీవ్ర మనస్తాపం చెందిన మోహన్ బాబు, తన వెంటపడుతున్న మీడియా ప్రతినిధులపై ఆవేశంతో దాడి చేయడం జరిగింది. దానినే మీడియా హైలైట్ చేస్తూ మోహన్ బాబుని దోషిగా చూపుతోంది తప్ప ఆయన ఎటువంటి పరిస్థితిలో తమతో దురుసుగా ప్రవర్తించారనేది చెప్పుకోలేదు.
ఏదైనా సమస్య, అంశంపై అభిప్రాయలు వ్యక్తం చేయడం మానవ సహజం. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో అందరికీ మరి కాస్త ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. కనుకనే మీడియా కూడా ప్రజలకు అటువంటి మసాలా వార్తలు అందించేందుకు వ్యక్తుల కుటుంబ వ్యవహారాలలో కూడా వేలు పెట్టేందుకు వెనకాడదు. కానీ మీడియా కూడా పరిధి అతిక్రమించకుండా హుందాగా వ్యవహరిస్తే బాగుండేది.
మోహన్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులలో ఒకరు. దశాబ్ధాలపాటు తెలుగు ప్రేక్షకులను తన నటనతో రంజింపజేశారు. ఆ సినిమాల ద్వారానే పేరు ప్రతిష్టలు, ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ ఈ గొడవల కారణంగా ఆయన పేరు ప్రతిష్టలకు భంగం కలిగింది. ఆస్తుల విషయంలో కూడా ఇంత రచ్చరచ్చ అవుతుండటం చాలా బాధకరమే.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఇంతకంటే ఎక్కువ మంది హీరోలే ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఉంటూ తల్లి తండ్రులు గర్వపడేలా ఉంటున్నారు. చిరంజీవితో సహా ఎవరికి వారు సినిమాలు చేసుకుంటూ పేరు ప్రతిష్టలు, ఆస్తులు కూడా సంపాదించుకుంటున్నారు.
ఇదేవిదంగా మోహన్ బాబు వల్లనే విష్ణు, మనోజ్ ఇద్దరూ సినీ పరిశ్రమలో, సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు, గౌరవం పొందినప్పుడు ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా వ్యవహరించాల్సిన బాధ్యత వారిదే కదా?
మనది సభ్య సమాజమే అనుకుంటే మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలని వినోదంగా భావించడం తగదు. వారి కుటుంబ సమస్యలను వారే పరిష్కరించుకుంటారు. లేకపోతే పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉండనే ఉన్నాయి. కనుక ఎవరూ తీర్పులు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమస్యల నుంచి మోహన్ బాబు కుటుంబం త్వరగా బయటపడాలని కోరుకుందాం.




