“లోకులు కాకులు… నవ్వితే నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు…” అన్నట్లు ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మళ్ళీ సంక్రాంతి పండుగకు సత్తెనపల్లిలో రోడ్లపై హుషారుగా డాన్సులు చేసారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయనకే సత్తెనపల్లి టికెట్ ఖరారు చేయడంతో ఆయన ఆనందానికి అంతే లేదు.
బహుశః ఆ ఆనందంతోనే ఇవాళ్ళ తెల్లవారుజామునే భోగీ పండుగ సందర్భంగా సత్తెనపల్లిలో బ్యాండ్ మేళం ఏర్పాటు చేసుకుని, మ్యాడ్ సినిమాలో కళ్ళజోడు పాప సూడు…” అనే పాటకు బంజారా మహిళలతో కలిసి హుషారుగా డాన్స్ చేసారు. ఆయన ఏటా సంక్రాంతి పండుగకు సత్తెనపల్లి లక్కీ డ్రా పేరుతో లాటరీ కూడా నిర్వహిస్తుంటారనే సంగతి తెలిసిందే.
మంత్రి హోదాలో ఉన్న అంబటి రాంబాబు ఈవిదంగా రోడ్లపై డాన్సులు చేయడం, స్థానిక ప్రజలు, వ్యాపారస్తుల నుంచి బలవంతంగా చందాలు వసూలు చేసి లక్కీ డ్రా లాటరీ నిర్వహిస్తుండటంపై ప్రతిపక్షాలు ఎంత విమర్శిస్తున్నా ఖాతరు చేయడం లేదు.
కానీ గత ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో నటుడు పృధ్వీ చేత ఆయనను అనుకరిస్తూ చిన్న డాన్స్ బిట్ పెడితే తనను అవమానించారంటూ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే ఎవరో పేరడీ చేసి అవమానించిన దానికంటే ఆయన తన పదవి, హోదా మరిచి రోడ్లపై ఈవిదంగా డాన్సులు చేస్తూ తనను తానే అవమానించుకుంటున్నారు. రాష్ట్ర ప్రజల దృష్టిలో చులకన అవుతున్నానని గ్రహించిన్నట్లు లేదు.
తన మంత్రి ఈవిదంగా రోడ్లపై డాన్సులు చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనను వారించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః ఆయనకు మంత్రిత్వ శాఖకు సంబందించి ఎటువంటి బాధ్యతలు అప్పగించకపోవడం వలననే ఈవిదంగా కళా ప్రదర్శనకు సమయం లభిస్తున్నట్లుంది.
మంత్రి అంబటి రాంబాబు రోడ్లపై చేస్తున్న ఈ డాన్సులను ఏపీతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ప్రజలు, రాజకీయ పార్టీలు అందరూ చూసి నవ్వుకుంటున్నారు. అయినా నవ్వితే నాకేటి… అన్నట్లు సంబరాల రాంబాబు తీరు.
భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు! pic.twitter.com/Tmtt5TDLMP
— Ambati Rambabu (@AmbatiRambabu) January 14, 2024




