నవ్యాంధ్రప్రదేశ్ కు మరో కీలక విభాగం రానుంది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి సమీపంలో కృష్ణాజిల్లా నాగాయలంక కేంద్రంగా భారత ప్రభుత్వం క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ఇదివరకే కేంద్రం, డీఆర్డీఓల నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. ఈ మేరకు గురువారం నాడు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర రక్షణ శాఖ, డీఆర్డీఓ అధికారులతో కూడిన బృందం నాగాయలంకలో పర్యటించింది.
క్షిపణి పరీక్షా కేంద్రం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని అటవీ శాఖాధికారులతో కలిసి పరిశీలించారు. మిసైల్ లాంచింగ్ పాడ్ కోసం సముద్ర తీరంలో ప్రతిపాదించిన స్థలాన్ని కూడా ఆ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా భూమి స్థితిగతులు, పరీక్షా కేంద్రం నిర్మాణం తదితరాలపై అటవీ శాఖాధికారులతో చర్చించారు. స్థానిక మీడియాతో ప్రముఖులతో మాట్లాడిన సదరు బృందం సభ్యులు ‘త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు’ వెల్లడించారు.



