శనివారం జరగాల్సిన బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ చక్రవర్తి వివాహం ఆగిపోయింది. తమిళనాడులోని ఊటీలో ఓ హోటల్లో బాలీవుడ్ నటితో ఆయన వివాహం జరగాల్సి ఉండగా, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇటీవల ఓ భోజ్పురి నటి మహాక్షయ్పై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహం చేసుకుంటానని నమ్మించి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. అతడి వల్ల గర్భం కూడా దాల్చానని, పిల్స్ ఇచ్చి అబార్షన్ చేశాడని ఆరోపించింది.
మహాక్షయ్ తల్లి యోగిత పైన కూడా ఆమె ఫిర్యాదు చేసింది. కాగా మహాక్షయ్ వివాహ విషయం తెలిసిన పోలీసులు హోటల్కు చేరుకున్నారు. వధువు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు వివాహాన్ని నిలుపుదల చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో మహాక్షయ్, ఆయన తల్లి యోగితలకు ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. దీంతో పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపధ్యంలో… వివాహం అర్ధంతరంగా ఆగిపోయింది.



