తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నామంటే ఎలా నమ్మలేమో మద్యం కుంభకోణంలో మిధున్ రెడ్డి మాటలు అలాగే ఉన్నాయి. సిట్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో శనివారం విచారణకు హాజరయ్యారు.
కానీ విచారణలో పోలీస్ అధికారులకు మిధున్ రెడ్డి సహకరించలేదని సమాచారం. అయినా సహకరిస్తేనే ఆశ్చర్యపడాలి కానీ సహకరించకపోతే ఆశ్చర్యపోనవసరం లేదు.
విచారణకు సహకరించకుండా అధికారులను ముప్ప తిప్పలు పెట్టిన మిధున్ రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, “నాకు ఈ కేసుతో ఎటువంటి సంబందమూ లేదు. కానీ పోలీసులు పిలవగానే విచారణకు హాజరై సహకరించాను. మళ్ళీ ఎన్నిసార్లు రామన్నా వస్తాను. విచారణకు సహకరిస్తాను,” అని అన్నారు.
విచారణ అనంతరం వైసీపీ నేతలందరూ చెప్పే మాటలే మిధున్ రెడ్డి కూడా చెప్పారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబందం లేదని కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతోనే తమని ఈ విదంగా తప్పుడు కేసులతో వేధిస్తోందని మిధున్ రెడ్డి తేల్చి చెప్పేశారు.
ఒక్క విజయసాయి రెడ్డి మాత్రమే ఈ మద్యం కుంభకోణం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభం అయ్యిందో, దీనిలో పాత్రధారులు, సూత్రదారులు ఎవరో చెపుతున్నారు.
కానీ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలందరూ కూడ బలుక్కున్నట్లు, అసలు మద్యం కుంభకోణం జరగనేలేదని కనుక అవినీతికి ఆస్కారమే లేదని చాలా నిర్భయంగా చెపుతుండటమే ఆలోచించాల్సిన విషయం. అంటే ముందుగానే వారందరికీ వారి న్యాయవాదులు కోచింగ్ ఇచ్చారా? అందుకే అందరూ ఒకేలా మాట్లాడుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది.
విచారణకు సహకరించని వైసీపీ నేతలను ఎలా డీల్ చేయాలో పోలీస్ అధికారులు ఆలోచించుకోవాలి. మద్యం కుంభకోణంలో అవినీతికి పాల్పడ్డారని నిరూపించాల్సిన బాధ్యత కూడా పోలీసులదే.
ఈకేసు పోలీస్ స్టేషన్ గడప దాటి కోర్టుకు చేరుకోక ముందే ఏమైనా చేయగలిగితే ఉపయోగం ఉంటుంది. లేకుంటే వైసీపీ నేతల విచారణ కోసం ప్రజాధనం వృధా అవుతుంటుంది అంతే!




