“మరీ దూకుడుగా వెళ్తున్నావు… నీ ఇష్టం వచ్చినట్లుగా కాకుండా, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి…” అంటూ ఇటీవల నగిరి ఎమ్మెల్యే రోజాను పిలిపించి పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి క్లాస్ పీకినట్లుగా మీడియా వర్గాలలో ప్రధానంగా ప్రసారమయ్యాయి. దీనికి మరింత బలాన్ని ఇచ్చే విధంగా తర్వాత జగన్ పాల్గొన్న విశాఖ కార్యక్రమంలో రోజా గైర్హాజరు కావడంతో, ‘జగన్ క్లాస్ పీకడం వలన రోజా అలిగింది’ అన్న టాక్ బాగా హల్చల్ చేసిన సంగతులు తెలిసినవే. అయితే రోజా అలిగిన దాంట్లో నిజం ఉన్నా, లేకున్నా గానీ… ఓ క్లాస్ అయితే రోజాకు పడింది అన్నది అసలు విషయం.
మరి ఆ తర్వాత అయినా తన నోటిని రోజా అదుపులో పెట్టారా? పార్టీ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారా? అంటే బహుశా ఆ క్లాస్ వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. ఏపీ రాజకీయాలలో టిడిపిని ఒంటరి చేయాలి అన్నది వైసీపీ ప్రధాన వ్యూహం. ఇటీవల పార్టీ రాజకీయ సలహాదారుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ చేసిన సూచనగా, రాజకీయ వర్గాలలో జరిగిన ప్రచారం విదితమే. ఈ దిశగానే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వామపక్షాలతో సహా అందరినీ 2019 ఎన్నికలకు కలుపుకు పోవాలని ఆలోచనలు చేస్తున్నారు. మరి రోజా వ్యాఖ్యలు ఆ దిశగానే చేస్తున్నారా?
అలా చేస్తే తను ఎలా హైలైట్ అవుతాను అనుకున్నారో ఏమో… లేక పార్టీ వ్యూహం రోజా వరకు వెళ్లిందో లేదో గానీ, జగన్ ఆలోచనలకు విరుద్ధంగా రోజా వ్యాఖ్యానిస్తుండడం విశేషం. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన వైసీపీ ప్లీనరీలో ప్రసంగించిన రోజా, ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం విశేషం. “ప్రశ్నిస్తానన్న మొనగాడు ఇప్పుడు ఎక్కడున్నారని, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకున్న పెద్ద మనిషి జీఎస్టీ భారం గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు, కాపులను సిఎం అన్యాయం చేస్తుంటే ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదు, గబ్బర్ సింగో, రబ్బర్ సింగో ఆయనే తేల్చుకోవాలి” అంటూ తీవ్రంగా పవన్ ను ఉద్దేశించి స్పందించారు.
ఓ పక్కన పార్టీ అధినేత వచ్చే ఎన్నికల సమయం నాటికి పవన్ ను ఎలా మచ్చిక చేసుకోవాలి అని వ్యూహరచనలు గావిస్తుంటే… మరో పక్కన రోజా అదే పవన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం అనేది, జగన్ కు మింగుడు పడని అంశంగా మారింది. తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కు సంబంధించిన సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది కాబట్టి, పవన్ ను టార్గెట్ చేస్తే తను హైలైట్ అవుతానని భావించారో ఏమో గానీ, పంచ్ ల మీద పంచ్ లు వేసారు. అయితే వీటిని పవన్ గానీ, వారి ఫ్యాన్స్ గానీ ఎంత సీరియస్ గా తీసుకుంటారో తెలియదు గానీ, జగన్ కు మాత్రం పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయని పొలిటికల్ వర్గాల టాక్.



