మలయాళ హీరోయిన్ భావనపై జరిగిన వేధింపులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని మలయాళ నిర్మాత ఆంటో జోసెఫ్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కు ఆంటో జోసెఫ్ తో సంబంధాలు ఉన్నాయని, అందుకే ఘటన జరిగిన వెంటనే అతని ఫోన్ నుంచి సునీల్ కు కాల్స్ వెళ్లాయని మలయాళ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే బయటకు వచ్చిన సదరు నిర్మాత, నిందితులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఈ ఘటన జరిగిన తరువాత దర్శకుడు లాల్ తనకు ఫోన్ చేశాడని, అయితే తన ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉండటంతో దానిని తాను అటెంప్ట్ చేయలేదని చెప్పాడు. ఆ తరువాత రెంజీ పనిక్కర్ ఫోన్ చేసి, జరిగిన దారుణం గురించి వివరించారని, వీలైనంత తొందరగా లాల్ ఇంటికి రావాలని పిలిపించారని తెలిపారు. దీంతో తాను ఎమ్మెల్యే పీటీ థామస్ తో పాటు లాల్ ఇంటికి వెళ్లానని, అప్పటికే పోలీసులు, భావన డ్రైవర్ మార్టిన్ అక్కడ ఉన్నారని చెప్పారు. దీంతో తాను మార్టిన్ ను అడిగి, పల్సర్ సునీల్ నెంబర్ తీసుకుని డయల్ చేశానని చెప్పారు.
తొలుత తన కాల్ ను సునీల్ లిఫ్ట్ చేయలేదని, తరువాత కాల్ బ్యాక్ చేసి, నువ్వెవరని అడిగాడని, తాను నిర్మాతనని, తన పేరు ఆంటో జోసెఫ్ అని చెప్పడంతో ఫోన్ పెట్టేశాడని తెలిపారు. అంతకు మించి అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి ఘటన ఏ అమ్మాయికీ జరగకూడదని తెలిపారు. లైంగిక వేధింపుల అనంతరం ఎమ్మెల్యే లాల్ భావన దగ్గరకి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఇలాంటి నిందితులను కాల్చి చంపాలని కిచ్చా సుదీప్ డిమాండ్ చేశాడు. నిందితులు భయపడేలా శిక్షలు ఉంటే కానీ వారి లాంటి దారుణాలకు తెగబడరని, భావనకు మద్దతుగా తామంతా నిలుస్తామని చెప్పాడు.
ఈ అత్యాచార ఘటనపై, సినీ పరిశ్రమ పోకడలపై ప్రముఖ మలయాళ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ మండిపడ్డారు. పితృస్వామ్యాన్ని నెత్తికెక్కించుకుని, హీరోయిజాన్ని హైలైట్ చేసినంత కాలం పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా నటులకు నిజమైన మద్దతు దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు. 99 శాతం సినిమాల్లో హీరోయిజాన్నే చూపిస్తున్నారని, ఫ్యామిలీ డ్రామాలు, కాలేజీ సినిమాల్లో సైతం పురుషాధిక్యాన్నే చూపిస్తున్నారని, ఈ సినిమాల్లో మహిళల వ్యతిరేక భావజాలం ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి పోకడలు కొనసాగినంత కాలం నటికి అన్యాయమే జరుగుతుంటుందని, ఇప్పటికైనా హీరోలు తమ డాంబికాలను తగ్గించుకోవాలని పితృస్వామ్య సూచించారు.


