మాజీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఎలాగైనా బయటకు రానివ్వకూడదని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ నెల 11న ఒక దళితుడిని ఇసుక తరలిస్తుండగా కొట్టారు అనే అభియోగంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉండటంతో ఆయన మీద ఉన్న పాత పెండింగ్ కేసులను తెర మీదకు తెస్తున్నారు.
మరో రెండు కేసులు ఆయన జైలులో ఉండగానే తెరమీదకు తెచ్చి వాటిలో ఆయనను కోర్టులో హాజరు పరిచి రేమండ్ పెరిగేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకూ ఆయనను మూడు కేసులలో అరెస్టు చేసారు. తద్వారా ఒక కేసులో ఆయనకు బెయిల్ వచ్చినా మరో కేసు కోసం లోపల ఉండాల్సిన పరిస్థితి.
ఆయన మీద దాదాపుగా 26 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ చెబుతుంది. ఆ కేసులలో ఫిర్యాదు చేసిన వారికి ధైర్యం చెప్పి వాటిని తిరిగి తెర మీదకు తీసుకువచ్చి చింతమనేనిని జైలుకే పరిమితం చెయ్యాలని అధికారపక్షం వ్యూహంగా కనిపిస్తుంది.
చింతమనేని జైలు నుండి విడుదల అయ్యే సమయానికి నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహంగా కనిపిస్తుంది. ఇటీవలే జరిగిన ఎన్నికలలో 13,311 ఓట్ల భారీ తేడాతో ఆయన మీద వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అబ్బాయి చౌదరి గెలుపొందారు. టీడీపీ కూడా అధికారంలో లేకపోవడంతో చింతమనేనికి ఇబ్బందులు తప్పడం లేదు.



