ఏ ఒక్క మ్యాచ్ లో అయినా టీమిండియాపై తమ దేశం విజయం సాధించకపోతుందా… అంటూ ప్రతి మ్యాచ్ కు వచ్చి ఆదరణ చూపుతున్న శ్రీలంక క్రికెట్ అభిమానులు, ఆదివారం నాడు సహనం కోల్పోయారు. టెస్ట్ సిరీస్ ను 3-0తో ఓడిపోయి, వన్డే సిరీస్ లో 2-0తో వెనుకంజలో ఉన్న తరుణంలో… కీలకమైన మూడవ వన్డేలో అయినా శ్రీలంక విజయం సాధిస్తుందని భావించిన ఫ్యాన్స్ కు మరోసారి చేదు అనుభవం ఎదురు కానుందని స్పష్టం కావడంతో, మ్యాచ్ మరో ఓవర్లో ముగుస్తుందనగా చేతిలోని మంచినీళ్ళ బాటిల్స్ ను మైదానంలోకి విసిరేసి నిరసన తెలిపారు.
అప్పటికి టీమిండియా కేవలం 8 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా, చేతిలో 6 వికెట్లతో 6 ఓవర్లు కూడా ఉన్నాయి. ఈ పరిణామంతో షాక్ తిన్న శ్రీలంక క్రికెటర్లు మైదానంలో నిల్చుని చూస్తుండగా, అప్పటికి క్రీజులో ఉన్న రోహిత్ శర్మ, ధోనిలు కాసేపు ముచ్చటించుకున్న తర్వాత, ధోని పక్కకు జరిగి మైదానంలోనే కాసేపు కునుకు తీసాడు. మైదానంలో ఓ పక్కన అంత రచ్చ జరుగుతుంటే, ఆడియన్స్ కు షాక్ ఇచ్చే విధంగా ధోని గ్రౌండ్ మధ్యలో పడుకుని నిరసన తెలపడం విశేషం. బహుశా ధోని మాత్రమే ఇలా చేయగలరు అనిపించే విధంగా తన మార్క్ ను ప్రదర్శించారు.
అయితే ఆ తర్వాత గ్రౌండ్ ఖాళీ చేయించడం, మళ్ళీ ఆట ప్రారంభం కావడం టీమిండియా విజయం సాధించడం జరిగిపోయాయి. దీంతో అయిదు వన్డేల సిరీస్ లో మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే 3-0తో టీమిండియా దక్కించుకుంది. 218 పరుగుల లక్ష్యచేధనలో 61 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా విజయసాధనలో ఓపెనర్ రోహిత్ శర్మ (124), మహేంద్ర సింగ్ ధోని (67) పరుగులతో సత్తా చాటి విజయతీరాలకు చేర్చారు. బౌలింగ్ లో విశేషంగా రాణించి 27 పరుగులకే 5 వికెట్లు తీసిన బూమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


