‘గీతం’ ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందడంతో మండలిలో విశాఖ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఒక స్థానం ఖాళీ కానుంది. దీనికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నాయి.
[m9ad]
2015 జులైలో శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేశారు. మూర్తి మండలి సభ్యత్వ కాల పరిమితి నాలుగేళ్లు. వచ్చే సంవత్సరం జులైతో కాలపరిమితి ముగియబోతోంది. అంటే ఇంకా దాదాపు 10 నెలల సమయం ఉంది. సాధారణంగా శాసనసభ స్థానానికి గడువుకు ఏడాదిలోపు ఖాళీ అయితే ఉప ఎన్నిక నిర్వహించరు.
శాసనమండలి స్థానం కావడం, ఎమ్మెల్సీని ఎన్నుకునే స్థానిక సంస్థల సభ్యుల కాలపరిమితి వచ్చే జులై వరకు ఉన్నందున ఉప ఎన్నిక రావొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అప్పట్లో మూర్తి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఇప్పుడు మాత్రం వైకాపా ఖచ్చితంగా పోటీ పెడుతుంది. ఇరు పార్టీలు విశాఖలో తమ పట్టు నిరూపించుకోవడానికి ఈ ఉపఎన్నికను వాడుకోబోతున్నాయి.
గత ఎన్నికలలో విశాఖలో వైకాపాకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. జగన్ తల్లి విజయమ్మ స్వయంగా విశాఖ పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా జరగుతున్నాయి. మరోవైపు ఇటీవలే మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందారు. సార్వత్రిక ఎన్నికలకు 9 నెలలు మాత్రమే గడువు ఉన్నందున ఆ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు.



