నాదేండ్ల భాస్కర్ రావు గురించి ఇప్పటి ప్రజలకు తెలియదేమో గానీ 80లలో ఆయన గురించి తెలియని వారు ఉండరు. ఎన్టీఆర్ బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్లిన సందర్భంలో అప్పటి కాంగ్రెస్ పాలిత కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి దొడ్డి దారిన అధికారం చేజిక్కించుకున్నారు. అయితే దానిని ప్రజలు కూడా తిరస్కరించారు. దీనితో ఆయన పదవి మూణ్ణాళ్ళ ముచ్చట అయిపోయింది. దానితో ఆయన రాజకీయ చరిత్ర కూడా ముగిసిపోయింది. ఇటీవలే ఆయన మళ్ళీ తెర మీదకు వచ్చారు.
ఎన్టీఆర్ మీద చంద్రబాబు మీద ఉన్న అక్కసుతో ఉన్నవీ లేనివీ మీడియాకు చెబుతున్నారు. ఆయన చెబుతున్న మాటలు టీడీపీ అంటే పడని వారికి మంచి పసందుగా ఉంటున్నాయి. ఈ రకంగా మరియు ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరిన సందర్భంగా ఆ పార్టీ అభిమానుల నుండి ఆయనకు మంచి మద్దతు లభిస్తుంది. కొందరు టీడీపీని డామేజ్ చెయ్యడానికి జనసేన ఆయనను వ్యూహాత్మకంగా తెర మీదకు తెచ్చిందని అనుకుంటున్నారు.
కొందరు మాత్రం ఎన్టీఆర్ సినిమా రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు మొత్తం ఆయన ఎన్టీఆర్ గురించి చేసిన ద్రోహం గురించే కాబట్టి ఆయన ఇప్పటి నుండే నష్టనివారణ చర్యలు మొదలు పెట్టారని అంటున్నారు. ఏది ఏమైనా నాదేండ్ల భాస్కర్ రావు చెబుతున్న వాటికి యూట్యూబ్ లో జనసైనికుల వల్ల మంచి డిమాండ్ ఏర్పడింది. దీనితో ఒక దాని తరువాత ఒకటి అన్నట్టు ఛానళ్ళు ఆయనను ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. వర్తమాన రాజకీయాల గురించి కూడా ఆయన విశ్లేషణలు చేస్తున్నారు.
నిన్న ఇటీవలే తెలుగుదేశం తలపెట్టిన జయహో బీసీ బహిరంగ సభ గురించి మాట్లాడుతూ ఒక పక్క బీసీలను ఇద్దరిస్తామని చెప్పుకుని తిరుగుతూ దేశానికే మొట్టమొదటి బీసీ ప్రధాన మంత్రి ఐన నరేంద్ర మోడీని గద్దె దించడానికి దేశమంతా తిరుగుతావా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ ను మోసం చేసిన మోడీని దించాలని చూస్తుంటే బీసీ ప్రధాని అంటూ వత్తాసు పలుకుతారా అంటూ టీడీపీ కౌంటర్ ఇస్తుంది. ఈయనను ఇప్పటిదాకా గట్టిగా మోస్తున్నారు కాబట్టి జనసేన బీజేపీ చీకటి ఒప్పందానికి ఇది మరో ఉదాహరణ అంటూ వారు జనసేన పార్టీని ఇరుకున పెడుతున్నారు.



