ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ఆడియో వేడుకలు చిత్ర యూనిట్, సూపర్ స్టార్ కృష్ణల చేతుల మీదుగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. ‘భజన’లకు దూరంగా జరిగే ప్రిన్స్ వేడుకలు ఒక్కోసారి అభిమానులకు కూడా రుచించవు. అయితే ఈ సారి మాత్రం ప్రిన్స్ ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ గెస్ట్ విచ్చేయనున్నారని తెలుస్తోంది. మిక్కీ జే మేయర్ స్వరపరచిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా పాటలు ‘కింగ్’ నాగార్జున చేతుల మీదుగా విడుదల కాబోతున్నాయని సమాచారం.
మే 1వ తేదీన తిరుపతిలో విడుదల చేయాలనుకున్న ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక, చివరికి హైదరాబాద్ లోనే శిల్పకళావేదికలో మే 7వ తేదీన జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రిన్స్ ఆడియోలు ఎప్పుడూ సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగానే విడుదల అవుతుంటాయి. అయితే ‘బ్రహ్మోత్సవం’ మాత్రం నాగ్ ఆవిష్కరించబోతున్నారన్న వార్త ఇరు వర్గాల అభిమానుల్లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది.
గతంలో ‘అఖిల్’ సినిమా ఆడియో వేడుక కోసం ప్రిన్స్ ను ఒక వీడియో ఇవ్వాల్సిందిగా కోరితే, వద్దు ఏకంగా ఆడియో వేడుకకే వస్తానని ప్రిన్స్ తనంతట తానుగా వచ్చి అఖిల్ కు శుభాకాంక్షలు తెలిపారు. బహుశా దీనికి నాగ్ బదులివ్వనున్నారో లేక ఇటీవల నాగ్ తో ‘ఊపిరి’ సినిమాను నిర్మించిన పివిపి సంస్థ ముఖ్య అతిధిగా ఆహ్వానించిందో గానీ, ‘కింగ్’ రానున్నారన్న వార్త ‘ప్రిన్స్’ ఫ్యాన్స్ కు పండగలా మారింది.



