నేటి సమాజ మంచి చెడుల విషయంలో సోషల్ మీడియా ఎంత ప్రముఖ పాత్ర పోషింస్తుందనేదానికి, దాని ప్రభావం ఎంత వేగంగా పనిచేస్తుందనేదానికి, దాని ఫలితాలు ఎంత బలమైన భరోసాగా నిలుస్తాయని చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
అయితే ఇందులో మంచి చెడులు అనే రెండు కూడా త్రాసులో వేసిన తులాభారం వంటిదే. సోషల్ మీడియా వాడకంతో సమాజంలో చెడు ఎలా జరుగుతుందో మంచి కూడా అంతే సమాన వాటాలో నిలుస్తుంది. తాజాగా 11 నెలల పసిబిడ్డ పునర్విక విషయంలో సోషల్ మీడియా పనిచేసిన వేగం, ఇచ్చిన భరోసా ఈ విషయానికి సాక్ష్యంగా నిలిచింది.
కర్నూల్ కి చెందిన సురేష్, పుష్పలత దంపతుల 11 నెలల చిన్న కుమార్తె పునర్విక SMA టైపు -1 అనే అరుదైన వ్యాధితో పోరాడుతుంది. ఈ అరుదైన వ్యాధి చికిత్స కు సుమారు 16 కోట్లు విలువ చేసే జోలీజెన్స్మ అనే జన్యు థెరపీ ఇంజక్షన్ డోస్ అవసరమవుతుంది.
అయితే ఇంత పెద్ద మొత్తం అంటే అది తమకు మోయలేని ఆర్థిక భారమే అంటూ అందుకు దాతల సాయం అవసరమంటూ పునర్విక తల్లితండ్రులు సోషల్ మీడియా వేదికగా క్రౌడ్ ఫండింగ్ కి ముందుకొచ్చారు. దీనితో ఆ పాప చికిత్సకు అవసరమైన 16 కోట్లకు గాను 10 కోట్లు బాధిత కుటుంబానికి సమకూరాయి.
ఇక ఆ మిగిలిన 6 కోట్లకు గాను సురేష్ దంపతులు ఐటీ మంత్రి నారా లోకేష్ కి సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసారు. ఇక దీని పై తక్షణమే స్పందిన మంత్రి లోకేష్ ఇప్పటికే క్రౌడ్ ఫండింతో సమకూరిన10 కోట్లు గాను దాతలకు కృతఙ్ఞతలు తెలుపుతూ ఇక ఇప్పుడు ఆ 6 కోట్లు తనవంతు అంటూ పునర్విక వైద్యానికి నేను సైతం అంటూ ముందుకొచ్చారు.
దీనితో ఇప్పుడు లోకేష్ సాయం, అందుకు ఆయన చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనితో సోషల్ మీడియా వేదికగా ఒకపక్క అస్లీలత, అసభ్యత ఎంత వేగంగా విస్తరిస్తుందో మరోపక్క ఇలా ఉదారత, ఆప్యాయత అంతే వేగంగా వ్యాపిస్తుందని స్పష్టమవుతుంది.
ఎవరో ముక్కు ముఖం కూడా తెలియని ఒక పసిబిడ్డ ప్రాణం నిలపడం కోసం ఇంతమంది దాతలు ఎటువంటి స్వప్రయోజనాలు ఆశించకుండా ఒక్క సోషల్ మీడియా విజ్ఞప్తి ని నమ్మి మేము సైతం అంటూ ముందుకొచ్చారు అంటే సమాజం పై సోషల్ మీడియా ప్రభావం ఏమేరకు పనిచేస్తుందో అని చెప్పడానికి ఈ ఒక్క సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.







