టిడిపి యువనేత నారా లోకేష్ నేడు పుంగనూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. “2024 మే నెలలో చంద్రబాబు నాయుడు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. ఆర్నెల్ల తర్వాత అంటే 2025 జనవరి నెలలో మా ప్రభుత్వం క్యాలండర్ విడుదల చేస్తుంది. జాబ్ క్యాలండర్ విడుదల చేసే బాధ్యత నాదేనని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి టిడిపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది,” అని చెప్పారు.
టిడిపి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు నాయుడు, పరిశ్రమలని, ఐటి కంపెనీలని, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ కంపెనీలని రప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారని అందరికీ తెలుసు. ఇందుకు హైదరాబాద్లో ఐటి కంపెనీలే నేటికీ ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీని కూడా అలాగే అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గట్టిగా కృషి చేశారు. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని అమరావతి నిర్మాణపనులు మొదలుపెట్టారు. విశాఖలో ఐటి కంపెనీలు, తిరుపతి జిల్లాలో శ్రీ సిటీ పారిశ్రామికవాడ, అనంతపురంలో కియా మోటార్స్ కంపెనీ వంటివెన్నో తీసుకువచ్చి వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించారు.
అయితే ప్రభుత్వంలో వివిద శాఖలలో ఖాళీలను కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు నిర్ధిష్టమైన జాబ్ క్యాలండర్ ప్రకటిస్తానని నారా లోకేష్ చెప్పడం చాలా సాహసోపేతమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీ కంటే ఆర్ధికంగా ఎంతో బలంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం నేటికీ జాబ్ క్యాలండర్ ప్రకటించడానికి వెనుకాడుతోంది. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 1.60 లక్ష ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టింది. కానీ డిసెంబర్లో జరుగబోయే ఎన్నికలలో వాడుకోవాలనే ఆలోచనతో ఈ ప్రక్రియని నెలల తరబడి సాగదీస్తోంది. కానీ ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చిన 6 నెలలోనే జాబ్ క్యాలండర్ విడుదల చేసి ఆ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తానని నారా లోకేష్ చెప్పడం ఆయన చిత్తశుద్ధిని సూచిస్తోంది.
గత కొన్ని నెలలుగా వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు నెలనెలా సకాలంలో జీతాలు కూడా చెల్లించడం లేదు. పైగా ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలలో డబ్బు కూడా వాడేసుకొంది. కనుక మంచి ఆర్ధిక క్రమశిక్షణ కలిగిన టిడిపి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే వారు కూడా సంతోషిస్తారు.



