జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్.. ఒకరు ముఖ్యమంత్రిగా చేయగా మరొకరు మంత్రిగా చేస్తున్నారు. జగన్ వైసీపీ అధినేతగా వ్యవహరిస్తుంటే, నారా లోకేష్ టీడీపీ ప్రధాన కార్యదర్శి మాత్రమే. కనుక వీరిద్దరినీ పోల్చి చూడలేము. కానీ పోల్చి చూడాల్సినవి చాలానే ఉన్నాయి.
2019 ఎన్నికలకు ముందు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళపాటు వైసీపీ నేతలు నారా లోకేష్ని ఎంతగా అవహేళన చేశారో అందరూ చూశారు.
నారా లోకేష్ తెలుగులో సరిగ్గా మాట్లాడలేక తడబడుతుండటం, ఆ వయసులోనే కాస్త లావుగా ఉండటం, ప్రజల మద్య కంటే సోషల్ మీడియాలో, పార్టీ కార్యకర్తలతోనే ఎక్కువగా సమయం గడుపుతుండటం వంటివి వారికి ఆ అవకాశం కల్పించాయని చెప్పొచ్చు.
మరొకరైతే ఆ అవహేళనాలు భరించలేక ఆత్మహత్య చేసుకొని ఉండేవారు లేదా రాజకీయాల నుంచి తప్పుకొనేవారు. కానీ నారా లోకేష్ వారి విమర్శలు, అవహేళనలతో తనలో లోపాలను గుర్తించి, అంగీకరించి వాటన్నిటినీ సరిదిద్దుకున్నారు.
బాగా సాన పట్టిన పదును తేలిన కత్తిలా మారారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తనని తాను ఆవిష్కరించుకున్నారు. రాష్ట్రంలో తమకు ఎదురేలేదన్నట్లు జగన్ ఏలుబడి సాగుతున్న రోజులలోనే నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేశారు. దానిలో ఆయన విశ్వరూపం చూసి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా హడలిపోయారో అందరూ చూశారు.
అంటే టీడీపీ, జనసేనలు కలవకూడదని, కలిసినా విడగొట్టాలని ఎంతగానో ప్రయత్నించిన జగన్ స్వయంగా వాటిని కలిపిన్నట్లే, వైసీపీ నేతలే నారా లోకేష్లో అనూహ్యమైన ఈ మార్పుకి సహకరించారన్న మాట!
ఆవిదంగా ప్రత్యర్ధుల విమర్శలు, అవహేళనాల నుంచే పాఠాలు నేర్చుకొని తనని తాను తీర్చు దిద్దుకున్న నారా లోకేష్ ఇప్పుడు మంత్రిగా రాణిస్తున్నారు. వైసీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నారు కూడా.
వైసీపీ విమర్శలతో నారా లోకేష్ ఇంత పరివర్తన చెందినప్పుడు, టీడీపీ, జనసేన, మీడియా విమర్శలతో జగన్ ఏమైనా నేర్చుకున్నారా? ఏమీ లేదనే చెప్పాలి.
జగన్ కంటికి అధికారం, అహంభావమే అని రెండు పొరలు కమ్మినప్పుడు ఏమీ చూడలేకపోయారని సరిపెట్టుకున్నా, ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదు.
ఆరు నెలలు అవుతున్నా ఇంకా తాడేపల్లి ప్యాలస్లో కూర్చొని అలవాటు లేని ప్రెస్మీట్లతో కాలక్షేపం చేస్తున్నారు. కనీసం చక్కగా తెలుగులో మాట్లాడటం కూడా నేర్చుకోలేదు. సిఎం చంద్రబాబు నాయుడు తన వైఫ్యల్యాలు కప్పి పుచ్చుకునేందుకు కుంభకోణాలపై విచారణ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు.
అయితే కూటమి ప్రభుత్వం ఒక్కో కుంభకోణం బయటపెడుతుంటే, వాటిని కడుక్కోవడానికే తన సమయమంతా సరిపోతోందనే విషయం జగన్ గ్రహించిన్నట్లు లేదు. ప్యాలస్లో నుంచి బయటకు అడుగు పెట్టలేకపోవడం జగన్ వైఫల్యమా లేదా అలా కట్టడి చేయడం కూటమి ప్రభుత్వ విజయమా?వైసీపీ నేతలే చెప్పాలి.
అధికారంలో ఉన్నప్పుడు 175తో అందరినీ మభ్యపెట్టిన జగన్ ఇప్పుడు ‘మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని’ ఇంకా మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అంటే జగన్ ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదని స్పష్టమవుతుంది.
కానీ జగన్ ఆశకు ఓ బలమైన కారణం ఉందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. 2024 ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపిలు కీచులాడుకొని విడిపోతే అప్పుడు మళ్ళీ తనకు అవకాశం వస్తుందని కలలు కంటున్నారట.
అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లా రేయింబవళ్ళు ప్రజల మద్య తిరిగి అధికారంలోకి రావాలనే ఆలోచన చేయకుండా, ఎప్పుడో.. ఏదో జరుగుతుంది.. జరిగితే అదృష్టం కలిసివస్తుందని జగన్ అనుకుంటున్నారన్న మాట! ఇలాంటి దూరాలోచనలు, ఇలాంటి దుర్లక్షణాలున్న అధినేతని నమ్ముకొని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏం బాగుపడతారు?






