ఇదిగో… మేము తెచ్చిన స్కూల్… మరి మీరేం తెచ్చారు?

nara lokesh padayatraనారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వివిద పరిశ్రమలని, తెచ్చిన ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలని, చేసిన అభివృద్ధిని చూపిస్తూ వాటి దగ్గర సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “ఇదిగో మేము వీటిని తెచ్చాము మరి ఈ మూడున్నరేళ్ళలో మీ వైసీపీ ప్రభుత్వం ఏం తెచ్చిందో ఓ సెల్ఫీ దిగి పంపగలరా?” అంటూ సవాళ్ళు విసురుతుంటే, వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలని చెప్పుకొనేవారు కూడా కిక్కురుమానడం లేదు. ఎందుకంటే టిడిపి హయాంలో రాష్ట్రానికి ఏం తెచ్చారో నారా లోకేష్‌ సెల్ఫీలు దిగి మరీ చూపిస్తున్నారు కానీ వైసీపీ నేతలు అలా చూపుకొనేందుకు ఏమీ లేదు కనుక!

నారా లోకేష్‌ ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్రలో మామండూర్ వద్దకి చేరుకొన్నప్పుడు అక్కడ తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన కాండోర్ ఇంటెర్నేషనల్ పబ్లిక్ స్కూల్ చూసి ఆగి, దానిని చూపిస్తూ ఓ సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “దక్షిణభారతదేశంలో అత్యంత ప్రఖ్యాతమైన విద్యాసంస్థలలో కాండోర్ ఇంటెర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఒకటి. దాని కోసం చంద్రబాబు నాయుడుగారు మామండూర్‌లో 8 ఎకరాలు స్థలం కేటాయించారు. అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఈ విద్యాసంస్థలో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వందలాదిమంది విద్యార్థులు ఇక్కడ చదువుకొంటున్నారు. కానీ వైఎస్ జగన్‌ కలలో కూడా ఈ ప్రాంతానికి ఇటువంటి గొప్ప విద్యాసంస్థను రప్పించలేరు,” అని ట్వీట్‌ చేశారు.

ADVERTISEMENT

వైసీపీ ప్రభుత్వం కొత్తగా విద్యాసంస్థలని రప్పించలేకపోయినా ఉన్న ప్రభుత్వ పాఠశాలలని విలీనం పేరుతో కుదించేసి, విద్యార్థుల సామర్ధ్యం, ఉపాధ్యాయుల నైపుణ్యాలు పరిగణనలోకి తీసుకోకుండా ఇంగ్లీష్ మీడియం, బైజూస్ పాఠాలు ప్రవేశపెట్టి విద్యార్థుల జీవితాలతో ప్రయోగాలు చేస్తోంది. ఈ ప్రయోగాల ఫలితాలు ఫలించాయా వికటించాయా అనే విషయం త్వరలో జరుగబోయే వార్షిక పరీక్షలలో ఎలాగూ తెలుస్తాయి.

ADVERTISEMENT
Latest Stories