జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తండ్రి చంద్రబాబు నాయుడుని పరామర్శించి వచ్చారు. అనంతరం తల్లి భువనేశ్వరిని, భార్య బ్రాహ్మణితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉందని భావిస్తున్నారా?”అని ఓ విలేఖరి సూటిగా ప్రశ్నించినప్పుడు, నారా లోకేష్ ఏమాత్రం తడబడకుండా, “ఇదో ఊహాజనితమైన ప్రశ్న. ఈ వ్యవహారంలో వారి ప్రమేయం ఉందని భావించడం లేదు. ఖచ్చితమైన ఆధారాలు లేకుండా వారిని నిందించడం తగదు,” అని చెప్పారు.
చంద్రబాబు నాయుడు 28 రోజులుగా జైల్లో ఉన్నప్పటికీ, నారా లోకేష్ 15 రోజులు ఢిల్లీలో వారి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసినప్పటికీ, మోడీ, అమిత్ షాలు పట్టించుకోలేదు. కనుక వారి అనుమతితోనే అరెస్ట్ చేసి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. కానీ నారా లోకేష్ తొందరపడి ఆ మాట అనకుండా చక్కగా జవాబు చెప్పారు. ఇది నారా లోకేష్ రాజకీయ పరిణతిని సూచిస్తోంది.
“జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు? ముందస్తు ఎన్నికలకు వెళతారంట కదా?” అనే ప్రశ్నకు “ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ళారో నాకెలా తెలుస్తుంది?వైసీపి నాయకులని ఎవరినైనా అడిగితే తెలుస్తుంది. ఆయన ముందస్తుకు వెళతారా లేకపోతే షెడ్యూల్ ప్రకారం వెళతారా?అనేది ఆయనే ఆలోచించుకోవాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము సిద్దంగా ఉన్నాము. మేమే ఈ పిచ్చిమారాజుని ఓడించి గద్దె దించుతాం,” అని నారా లోకేష్ అన్నారు.
పవన్ కళ్యాణ్పై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి నోటీసులు ఇస్తుండటంపై నారా లోకేష్ స్పందిస్తూ, “మేము రాష్ట్రాభివృద్ధి, అమరావతి, పోలవరం, పరిశ్రమల గురించి ప్రశ్నిస్తున్నందుకు మాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా నిలదీసి ప్రశ్నిస్తున్నారు కనుక ఆయనపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు.
అయితే జగన్ పోలీసులను పెట్టుకొని ఇంకెంత కాలం పరిపాలన చేయగలరు? మహా అయితే మరో ఆరు నెలలు. ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏమిటి? మంత్రులు, ఎమ్మెల్యేలు పోలీసుల రక్షణ లేకుండా మాలాగ ప్రజల మద్యకు రాగలరా? వస్తే ప్రజలే వారికి బుద్ధి చెపుతారు. ఇప్పుడు అతిగా ప్రవర్తిస్తున్న పోలీసులు కూడా వైసీపి నేతలతో పాటు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. కనుక రాజ్యాంగం ప్రకారం నడుచుకోమని చెపుతున్నా,” అని అన్నారు.
ఒకప్పుడు ప్రజలతో మాట్లాడేందుకే తడబడే నారా లోకేష్ ఇప్పుడు ఒంటరిగా మీడియా సమావేశాలను నిర్వహిస్తూ ధైర్యంగా మీడియాను ఎదుర్కొని జవాబులు చెపుతున్నారు. కానీ నేటికీ ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా మీడియా సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు కదా?



