ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు రాకముందే రాజకీయ హత్యలు మొదలయ్యాయి. ఈరోజు ఉదయం కర్నూల్ జిల్లాలోని డోన్ మండలం మల్లెంపల్లిలో బుధవారం రోజున టీడీపీకి చెందిన శేఖరరెడ్డిని ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏ నిమిషంలో ఏమవుతుందో అని ప్రజలు ఆందోళనతో ఉన్నారు. శేఖరరెడ్డి టీడీపీ ఆలూరు అభ్యర్థి కోట్ల సుజాతమ్మ తరపున పని చేశారు. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల పని అని స్థానికి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
శేఖర్ రెడ్డి తన స్వగ్రామం కృష్ణగిరి మండల చాపలకొత్తూరు నుంచి ద్విచక్రవాహనంపై డోన్ వెళ్తుండగా ప్రత్యర్థులు మాటువేసి దాడికి పాల్పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాడ్డులతో దాడిచేసి, బండరాయితో తలపై మోదారు. దీంతో తీవ్రరక్తస్రావమైన శేఖర్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తర్వాత దుండగులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్లను రంగంలోకి దింపారు.
మరోవైపు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఎన్నికలకు ముందే హతుడు శేఖరరెడ్డి కోట్ల వర్గంతో కలిసి టీడీపీలో చేరారు. ఘటనపై మంగళగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఈ ఘటనను లోకేష్ తీవ్రంగా ఖండించారు. “కర్నూలులో తెదేపా నేత శేఖర్ రెడ్డి హత్య దిగ్భ్రాంతి కలిగించింది. ఆధునిక సమాజంలో ఇలాంటి ఆటవికచర్య అమానుషం. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరుతున్నాను. శేఖర్ రెడ్డి కుటుంబానికి తెదేపా అన్నివిధాలుగా అండగా ఉంటుంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని లోకేష్ ట్వీట్ చేశారు.



