వర్తమాన రాజకీయాలు ఎంతగా దిగజారిపోయినప్పటికీ, నేటికీ దేశంలోని రాజకీయ నాయకులందరూ ఒక నియమం నిఖాచ్చిగా పాటిస్తూనే ఉన్నారు. అదే… వారి అంతర్గత సంభాషణలను బహిర్గతం చేయకుండా సంయమనం పాటిస్తుండటం. అయితే రాజకీయాలలో నైతిక విలువలు దిగజారుతున్నందున ఈ అప్రకటిత ఆనవాయితీని కూడా కొందరు పక్కన పెట్టి అంతర్గత సంభాషణలను బయటపెడుతుంటారు.
ప్రధాని నరేంద్రమోడీ మొన్న తెలంగాణలో పర్యటించినప్పుడు కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిసినప్పుడు ఏమి మాట్లాడుకొన్నారో బయటపెట్టారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరుతానని అన్నారని, తన కుమారుడు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలనుకొంటున్నానని తనకు చెప్పారనే విషయాన్ని మోడీ బయటపెట్టారు.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీతో బీజేపీ కుమ్మక్కు అయ్యిందని ఆరోపణలు, ఊహాగానాలు వినపడుతున్నందున అవి నిజంకావని చెప్పేందుకే బహుశః మోడీ ఈ విషయం ఇప్పుడు బయటపెట్టి ఉండవచ్చు. అది వేరే విషయం.
అయితే తెలంగాణ సిఎం కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనతో ఏకాంతంగా ఏమి మాట్లాడారో బయటపెట్టిన ప్రధాని నరేంద్రమోడీ, రేపు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తనతో ఏమి మాట్లాడారో కూడా బయటపెడతారా?అనే సందేహం కలుగుతుంది.
అయితే కేసీఆర్ తనపై కత్తులు దూస్తున్నారు కనుక మోడీ ఆయన ఆలోచనలను తెలంగాణ ప్రజలకు తెలియజేసి వారిని బీజేపీ వైపు తిప్పుకొనేందుకే ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మోడీ, అమిత్ షాలకు వీరవిధేయంగా ఉంటూ, అవసరమైనప్పుడల్లా కేంద్రానికి పార్లమెంటులో మద్దతు ఇస్తున్నారు. కనుక జగన్ తనతో ఏకాంతంగా ఏం మాట్లాడారనే విషయాన్ని ప్రధాని బయటపెట్టరు.
కానీ ఆయనను వద్దనుకొన్నప్పుడు తప్పకుండా అన్ని విషయాలు బయటపెట్టడం తధ్యమే. అప్పుడు అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, అప్పులు, టిడిపిని దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రల గురించి చెప్పాల్సి ఉంటుంది. టిడిపి, జనసేనల కంటే వైసీపిని నమ్ముకోవడమే మంచిదని ప్రధాని భావిస్తే ఈ రహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే మిగిలిపోతాయి.



