ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం తిరస్కరించి మే 14వరకు జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించింది. కనుక తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ (మే 13) ముగిసిన వెంటనే లేదా ఫలితాలు (జూన్ 4) వెలువడగానే కడిగిన ఆణిముత్యంలా ఆమె తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఆమె అరెస్టుకు సంబందించి బీజేపీ నిజామాబాద్ ఎంపీ, అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ తాజా ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
“తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయకపోవడం వలననే ప్రజలకు (బీజేపీ-బిఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయనే) తప్పుడు సంకేతాలు వెళ్ళి బీజేపీ ఓడిపోయింది,” అని చెప్పారు.
అయితే “అందుకే లోక్సభ ఎన్నికలకు ముందు ఆమెను అరెస్ట్ చేశారా?” అనే ప్రశ్నకు ఆయన రాజకీయ ఫార్ములా ప్రకారమే “ఈ కేసుకి, ఆమె అరెస్టుకి మాకు, మా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదు. ఆమె మద్యం కేసులో అవినీతికి పాల్పడినందునే సీబీఐ అరెస్ట్ చేసిందని” అని సమాధానం చెప్పారు.
కానీ మొదట ఆమెను అరెస్ట్ చేయకపోవడం వలననే ఓడిపోయామని చెప్పినందున, ఆ తప్పుని సవరించుకునేందుకే లోక్సభ ఎన్నికలకు ముందు ఆమెను అరెస్ట్ చేశామని చెప్పకనే చెప్పుకున్నట్లయింది.
రాజకీయ కక్షతోనే ఆమెను అరెస్ట్ చేశారని కేసీఆర్, కేటీఆర్, తదితర బిఆర్ఎస్ నేతల వాదనలను నిజమేనని బీజేపీ తరపున ఆయన స్వయంగా ధృవీకరించిన్నట్లయింది. కీలకమైన ఎన్నికల సమయంలో ఎవరైనా ఇటువంటి వివాదాస్పద స్టేట్మెంట్స్ ఇస్తారా?
అయితే కూతురుకి ఈడీ నోటీస్ పంపితేనే నానా హంగామా చేసిన కేసీఆర్, లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆమె అరెస్టు గురించి ప్రచారం చేసుకొని సానుభూతి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తారనుకుంటే అసలు ఆమె ఊసే ఎత్తడం లేదు.
మరో విషయం ఏమిటంటే శాసనసభ ఎన్నికలలో ఓటమి తర్వాత 3-4 నెలల పాటు కేసీఆర్, బిఆర్ఎస్ నేతలు ఎవరూ మోడీ పేరే ఎత్తలేదు. మళ్ళీ ఇప్పుడు మోడీని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
కల్వకుంట్ల కవిత అరెస్ట్, దాని గురించి ధర్మపురి అర్వింద్ చెప్పిన విషయం, మోడీపై కేసీఆర్ విమర్శలు అన్నిటినీ కలిపి చూస్తే, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య ఎటువంటి రహస్య అవగాహన లేదని, బద్ద విధులమని తెలంగాణ ప్రజలను నమ్మించేందుకే రెండు పార్టీలు కలిసి ఈ డ్రామా ఆడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమో కాదో ఎన్నికలు ముగియగానే తెలుస్తుంది.




