దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపన సరిగ్గా జరగలేదు. ఒక్క కర్ణాటకలోనే కాస్త గత వైభవం కనిపించింది. జయలలిత మరణంతో తమిళనాట అవకాశం చిక్కినట్లయ్యింది. దీంతో తిమ్మిని బమ్మిని చేస్తూ తమిళనాడు రాజకీయాలను బ్రష్టు పట్టించిన ఘనతను బిజెపి సొంతం చేసుకుంది. అలాగే ఇటీవల ముగిసిన కన్నడ రాజకీయం తెలియనిది కాదు. ఇక మిగిలింది ఏపీలోనే అంటూ ఓ పక్కన జగన్ తో, మరో పక్కన పవన్ తో ఒప్పందాలు కుదుర్చుకుని నీచ రాజకీయం చేస్తోందన్న విమర్శలను మూటకట్టుకుంది.
ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా… అసలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపిపై ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే తాజాగా లగడపాటి ఇచ్చిన సర్వే బహుశా ‘మోడీ అండ్ కో’కు దిమ్మతిరిగే జవాబును ఇచ్చినట్లయ్యింది. గత ఎన్నికలలో టిడిపితో టై అప్ పెట్టుకోవడం వలన కొన్ని సీట్లను గెలవగలిగింది గానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోగా, ఇండిపెండెంట్ల కంటే అధ్వానమైన పరిస్థితిలో జాతీయ పార్టీ ఉందన్న విషయం తేటతెల్లమైంది. ఇతరుల జాబితాలో 3 శాతం వరకు ఓటింగ్ ఉంటుందని తెలుపగా, బిజెపికి మాత్రం కేవలం 1 శాతం మాత్రమే పడుతుందని సర్వే స్పష్టం చేసింది.
అయితే ఆ ఒక్క శాతం కూడా ఎలా వస్తుందనేది పక్కన పెడితే, ఓవరాల్ గా ఏపీ ప్రజలు బిజెపిపై ఎంత ఆవేశంతో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. అంటే గత ఎన్నికలలో కాంగ్రెస్ కు పట్టిన గతే, ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కవనేది స్పష్టం. ఏపీపై మోడీ పెట్టుకున్న ఆశలు గల్లంతు కావడం తధ్యం. అంతేకాదు ఏపీకి మోడీ అన్యాయం చేసారా? అన్న ప్రశ్నకు అయితే ఏకంగా 83 శాతం మందికి పైగా అవునని జవాబిచ్చారు. మోడీకి పుండు మీద కారం జల్లే విషయం ఏమిటంటే… అధికారంలో ఉన్న టిడిపి సర్కార్ కు 53 శాతంకు పైగా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేయడం..!



