ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త రిజర్వేషన్ల కోసం పట్టుపడుతున్నారు. తెలంగాణాలో ముస్లింలకు, ఆంధ్రప్రదేశ్ లో కాపులకు రిజర్వేషన్ల కోసం శాసనసభ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపారు. ఈ కొత్త రిజర్వేషన్లతో రెండు రాష్ట్రాలలోను రేజర్వేషన్లు 50% దాటాయి. కాబట్టి వీటిని ఆమోదించి రాజ్యాంగంలోని సెక్షన్ 9 లో పెడితే తప్ప చెల్లవు.
అయితే ఇద్దరు ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి మోడీ సమాధానం చెప్పకనే చెప్పారు. పైగా సమధానం గుజరాత్ నుండి చెప్పారు. యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెబితే అది తప్పుడు హామీయే అవుతుందని తేల్చిచెప్పారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం పరిమితిని దాటే ఉద్దేశం తనకు లేదని చెప్పకనే చెప్పారు.
గుజరాత్లో పటేల్ సామాజిక వర్గానికి కొత్తగా రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారనే అనుకోవాలి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలోను దీనికి బీజేపీ రాయకీయ మూల్యం చెల్లించుకోవాల్సిరావొచ్చు.
రిజర్వేషన్ల విషయంలో తాము చేయాల్సిందంతా చేసేశామని, కేంద్రం సహకరించలేదని రెండు వైపుల వారు చెప్పుకుంటారు. దీనితో బీజేపీ ఇరుకునపడడం తధ్యం. గుజరాత్ లో బీజేపీకు వ్యతిరేక ఫలితాలు వస్తే కేంద్రం దీనిపై ఆలోచన చేయవచ్చు. లేకపోతే ఇంక ఇక్కడకూడా ఆశలు వదులుకోవడమే.





