దేశాన్ని పట్టిపీడిస్తోన్న నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతోంది. పెద్ద నోట్ల రద్దు వంటి సంచలన నిర్ణయం తీసుకున్న తరువాత ఇప్పుడు బినామీ ఆస్తులపై దృష్టి పెట్టింది. పలువురు బినామీ పేర్లతో బ్యాంకు లాకర్లలో దాచిన నల్లధనం, నగలపై చర్యలు తీసుకునేందుకు మొదటి అడుగు వేసి, వాటిని పరిశీలించాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులను రంగంలోకి దింపింది.
నవంబర్ 8 తరువాత ఎక్కువ సార్లు లాకర్లు తెరిచిన వారి వివరాలను వారు బ్యాంకుల నుంచి తీసుకున్నారు. ఆయా లాకర్లు ఎవరివి? అనే విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు కేంద్రం సర్కారు ప్రకటించింది. ఇటీవల ఐటీ చేసిన దాడుల ఫలితంగా పన్ను చెల్లించని 5,343 కోట్ల ఆస్తులు వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీంతో ఐటీ శాఖ ఇప్పుడు బినామీ లాకర్లపై నిఘాను మరింత పటిష్టం చేసింది.
నవంబరు 10 తరువాత బ్యాంకుల్లో తెరచిన కొత్త ఖాతాల సమాచారాన్ని కూడా తీసుకుంది. ఇప్పటికే ఆరు వేల మందికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. అంతేగాక వెయ్యి మందిపై దాడులు నిర్వహించామని, నల్లధనం ఉన్న 279 మందిపై కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఎన్ని విమర్శలు, అడ్డంకులు వచ్చినా ఈ ‘ఆపరేషన్ బ్లాక్ మనీ’ని మోడీ సర్కార్ ముందుకు తీసుకువెళ్ళేలా కనపడుతోంది.



