భారత ప్రధానమంత్రిగా బీజేపీ నేత నరేంద్ర మోడీ నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలకు షాకిచ్చిన మోడీ, దేశంలో మూడు దశాబ్దాలుగా ఏ ఒక్క పార్టీకి సాధ్యం కాని రీతిలో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మిత్రపక్షాల సాయం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు సాధించిన మోడీ… ఆ తర్వాత మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా… వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో…
ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తున్నామని, సంస్కరణల అమలును వేగవంతం చేశామని, ఇండియాలో ఎన్డీయే సర్కారు చేయాల్సిందే చేస్తోందని అన్నారు. తన ముందు ఎంతో లక్ష్యం ఉందని, అది సుదూరంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డ ప్రధాని, అత్యధిక సంస్కరణలను ఇప్పటికే అమలు చేస్తున్నామని తెలిపారు. విదేశీ పెట్టుబడుల విషయంలో మరింత సరళీకృత విధానాన్ని తీసుకువస్తామని, అవినీతిని పూర్తిగా రూపుమాపేందుకు మరిన్ని చర్యలు అవసరమని అన్నారు.
గ్రామీణ భారతావనిలో మౌలిక వసతుల కొరతను అధిగమించాల్సి వుందని, కీలకమైన గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అమలైతే, ఇండియాలో వ్యాపారం మరింత సులువవుతుందని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు అమలవుతుందన్న నమ్మకముందని తెలిపారు. ఇదిలా ఉంటే, వచ్చే నెల ఆరంభంలో నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. సదరు పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సభలో మోడీ ప్రసంగించనున్నారు.



