ఒకప్పుడు ఇల్లు, కుటుంబం అంటే మనిషికి మొదటి భద్రతా వలయం. బయట ప్రపంచం ఎంత కఠినంగా ఉన్నా ఇంట్లో సంతోషం, ఓదార్పు రెండూ దొరికేవి. కుటుంబంలోని బంధాలు మనిషిని బలంగా నిలబెట్టేవి.
కానీ ఇప్పుడు ఆర్ధిక సమస్యలు, పని ఒత్తిళ్ళు, ఆస్తి గొడవలు, వ్యసనాలు, చివరికి మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వంటివి కూడా కుటుంబ సభ్యుల మద్య దూరం పెంచుతున్నాయి. కుటుంబ బంధాలను దెబ్బ తీస్తున్నాయి. కొన్నిసార్లు విషాద ఘటనలకు దారి తీస్తున్నాయి. .
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో జరిగిన ఓ ఘటన ఇందుకు ఉదాహరణ.
ఆస్తి తగాదాలు, మద్యం మత్తు కారణంగా ఓ వ్యక్తి మొదట భార్యపై దాడి చేశాడు. ఆ తర్వాత గ్రామంలో నివాసం ఉంటున్న తల్లి వద్దకు వచ్చి ఆమెతో కూడా గొడవపడ్డాడు. మద్యం మత్తులో తల్లిపై దాడి చేసి ప్రాణాలు తీశాడు. మర్నాడు ఉదయం మత్తు దిగిన తర్వాత పక్కనే రక్తపు మడుగులో చనిపోయున్న తల్లిని చూసి, హత్యానేరం కింద జైలు జీవితం గడపాల్సి వస్తుందని ఆ తల్లి చీరతోనే అతను కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నట్లు నిత్యం వార్తలలో చూస్తూనే ఉన్నాము. దీనికి కారణాలు ముందే చెప్పుకున్నాము.
ఒకప్పుడు దేశంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ కుటుంబ పెద్ద మాటకు కట్టుబడి ఉండేవారు. ఒకవేళ విభేదిస్తే గ్రామ పెద్దల పరిస్థితిని చక్కదిద్దేవారు. కానీ ఇప్పుడు అన్నీ మినియేచర్ ఫ్యామిలీలు. ఇటువంటి సమస్యలు ఏర్పడి పరిష్కారించుకోలేకపోతే విడాకులు, హత్యలు, ఆత్మహత్యలతో విషాదంగా ముగుస్తున్నాయి. అత్యంత బలమైన కుటుంబ సంబంధాలు కలిగిన భారతీయ సమాజంలో ఈ మార్పుని జీర్ణించుకోవడం కష్టమే. కానీ తప్పదు.




