డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. రెండు భుజాలలలోని కండరాలు గాయపడటంతో గత కొంత కాలంగా ఆయన నొప్పితో బాధ పడుతున్నారు. కనుక భార్యతో కలిసి సోమవారం ముంబై వెళ్ళారు. అక్కడ కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆస్పత్రిలో వైద్యులు అవసరమైన పరీక్షలు చేసి భుజాలలోని రొటేటర్ కఫ్ జాయింట్కు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని సూచించారు. అయితే ప్రభుత్వపరమైన కొన్ని కార్యక్రమాలు, పనులు పూర్తిచేసుకొని తిరిగి వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
సిఎం చంద్రబాబు నాయుడు కంటే వయసులో 21 ఏళ్ళు చిన్నవారైన డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. రెండు నెలల క్రితం ముక్కుకి ఇన్ఫెక్షన్ అయ్యి అది వ్యాపిస్తుండటంతో ఏప్రిల్ 18న హైదరాబాద్లో శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
ఈ నెల 10న ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనని పరామర్శించారు. రాజకీయాలలో ఉన్నవారు ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యమని హితవు చెప్పారు.
నెల తిరక్క మునుపే ఇప్పుడు భుజం, కండరాల సమస్యతో అత్యవసరంగా శస్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
సినిమా షూటింగ్లలో నటీనటులు గాయపడుతుంటారు కనుక హరిహరవీరమల్లు, ఓజీ వంటి యాక్షన్ సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్కి ఇటువంటి సమస్యలు రావడం సహజమే.
కానీ ఈ ఆరోగ్య సమస్యలు రాజకీయ జీవితానికి అవరోధంగా మారకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడటం చాలా అవసరం.
పవన్ కళ్యాణ్పై చాలా బరువు బాధ్యతలున్నాయి. తొలిసారిగా డెప్యూటీ సిఎం, మంత్రి పదవి చేపట్టిన పాలనా వ్యవహారాలపై అవగాహన సంపాదించుకొని పట్టు సాధించి సమర్ధత నిరూపించుకోవాల్సి ఉంది. అదే సమయంలో ఏపీలో జనసేనని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఇది కాక తెలంగాణలో కూడా జనసేన విస్తరణకు సిద్ధమవుతున్నారు. ఇవే అనుకుంటే ఓజీ-2 చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారిప్పుడు.
రాజకీయాలలో ఇప్పుడే ఓ స్థాయికి చేరుకున్న పవన్ కళ్యాణ్, మరో రెండు మూడు దశాబ్దాలు రాజకీయాలలో కొనసాగి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం.
ఈవిధంగా తరచూ అనారోగ్యం పాలవుతుంటే భవిష్యత్ రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశం వచ్చినప్పుడు ఆయనే వద్దనుకుని వదులుకునే పరిస్థితిలో ఉండకూడదు.
ముఖ్యంగా జనసేన మనుగడకు తన ఆరోగ్యం చాలా కీలకమని పవన్ కళ్యాణ్ గ్రహించడం చాలా అవసరం.




