ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాధ్ కధ అందించి దర్శకత్వం వహించిన “బిజినెస్ మెన్” స్టోరీ గుర్తుందా..! దాదాపుగా ప్రతి సన్నివేశంలోనూ కనిపించే హీరో పాత్రను పూరీ ఎక్కడ నుండి డిజైన్ చేసారో గానీ, ఈ సినిమాలో పూరీ వాడిన ‘సూర్య భాయ్ టాక్స్’ విషయం అప్పట్లో పెను సంచలనంగా మారింది. బహుశా ఈ సినిమాను చూసి స్ఫూర్తి పొందాడో లేక తన బిజినెస్ దందానే అలాంటిదో గానీ, తాజాగా గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో ‘సిట్’ బృందం విచారణలో పలు అవాక్కయ్యే నిజాలు వెలుగు చూస్తున్నాయి.
‘బిజినెస్ మెన్’ సినిమాలో మహేష్ విధించిన ‘సూర్య టాక్స్’ తరహాలో నయీమ్ కూడా 2% ‘నయీమ్ టాక్స్’ వసూలు చేస్తున్నారనే సమాచారం తాజాగా వెలుగు చూసింది. నయీమ్ నేర సామ్రాజ్యం చూసి పోలీస్ వర్గాలే అవాక్కవుతున్నారు. ‘మినీ దావూద్ ఇబ్రహీం’ మాదిరి అన్ని రంగాలలో నయీం దందాలు కొనసాగాయన్న విషయాలు పరిచయమవుతున్నాయి. లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకారం… పోలీసులు స్వాధీనం చేసుకున్న 7టిబి హార్డ్ డిస్క్స్ లో దాదాపుగా 2500 సినిమాలకు సంబంధించిన సమాచారం ఉందట.
మరి ఇది ఫైనాన్స్ కు సంబంధించిన వివరాలా? లేక ఇతర సమాచారమో తెలియదు గానీ, రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తూ… చనిపోయి కూడా పోలీస్ వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అయితే అన్నింటి కంటే హైలైట్ మాత్రం ‘నయీం టాక్స్’నే పేర్కొంటున్నారు పోలీసులు. బడా రాజకీయ వేత్తలను బెదిరింపులకు గురి చేసిన నయీమ్ పేరు చెబితేనే వణికిపోయిన వ్యాపారులు, అతడు అడిగిన మేరకు కప్పం కట్టేవారట. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ నయా దందాను పోలీసులు ‘నయీమ్ ట్యాక్స్’గా పిలుస్తున్నారు.



