అవును… మరో టాలీవుడ్ హీరో రాజకీయ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కాలనీ, లోటస్ పాండ్ వద్ద గల ఆర్.ఎన్.ఆర్. ఆడిటోరియంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఓ పోస్టర్ ను విడుదల చేసి ధృవీకరించారు. “జోగేంద్ర యువగర్జన” పేరుతో ఏర్పాటు కాబోతున్న ఈ సభకు తమ కుటుంబ సభ్యులతో తరలిరమ్మని ఆహ్వానం పలుకుతున్నారు ఇటీవల ‘భల్లాలదేవుడు’ అవతారం దాల్చిన రానా.
అవును… ఇదంతా దగ్గుపాటి రానా ప్రధానపాత్రలో తెరకెక్కిన “నేనే రాజు నేనే మంత్రి” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన కధాకమామీషు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా కధ రాజకీయ నేపధ్యంలో రూపుదిద్దుకోవడంతో, అదే తరహా అనుభూతిని ప్రేక్షకులకు కలిగించేందుకు ‘ప్రీ రిలీజ్ ఈవెంట్’ పేరు కాస్త ‘జోగేంద్ర యువగర్జన’గా మారిపోయింది. ఆగష్టు 11వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలతో పాటు సినీ ప్రేక్షకులలో కూడా విపరీతమైన బజ్ ఉంది.
తాజాగా ఈ సినిమాపై మరో ఆసక్తికరమైన విషయం ట్రేడ్ వర్గాలలో వినపడుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉండనుందనే టాక్ హల్చల్ చేస్తోంది. ఈ క్లైమాక్స్ తో తేజ ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారని, అది ప్రేక్షకులకు కనెక్ట్ చేయడమనేది ఓ సాహాసంతో కూడుకున్న నిర్ణయమని చెప్తున్న సంగతులు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. బహుశా ఇదే హైలైట్ గా ‘జోగేంద్ర యువగర్జన’ సాగనుందేమో ఈ మంగళవారం నాడు చూడాలి.


