సుజీత్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో గత ఏడాది సెప్టెంబర్లో వచ్చిన ఓజీ సూపర్ హిట్ అయ్యింది. అప్పుడే దాని సీక్వెల్ చేస్తానని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. ఆ ప్రకారమే ఓజీ సీక్వెల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించబోతున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో బిజీ అయ్యి, డెప్యూటీ సిఎం, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతికష్టం మీద ఒప్పుకున్న మూడు సినిమాలు పూర్తిచేయగలిగారు.
ఓ సినిమాని సకాలంలో పూర్తిచేయలేకపోతే అది ఎంతగా దెబ్బ తింటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు క్షణం తీరిక లేని జీవితం గడుపుతున్న డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఓజీ సీక్వెల్ చేయాలనుకోవడం సాహసమే అని చెప్పాలి.
పవన్ కళ్యాణ్ ఇటీవలే హైదరాబాద్లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకుగాను తెలంగాణలో జనసేనని బలోపేతం చేసుకుంటామని చెప్పారు. కానీ ఇల్లలకగానే పండుగ కాదన్నట్లు తెలంగాణలో జనసేనకు దారి పొడవునా ముళ్ళబాటే కనిపిస్తోంది. అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ స్వయంగా పూనుకోవాల్సి ఉంటుంది. లేకుంటే వృధాప్రయాసే మిగులుతుంది.
మరోపక్క ఏపీలో జనసేన నేటికీ ఆశించిన స్థాయిలో బలోపేతం కానేలేదు. కనీసం జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియని సవ్యంగా నిర్వహించలేకపోయారని పవన్ కళ్యాణ్ స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కనుక ఏపీలో జనసేనని బలోపేతం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ స్వయంగా గట్టి ప్రయత్నాలు చేయడం చాలా అవసరం.
నిజానికి పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నప్పుడే రెండు పడవల ప్రయాణం మంచిది కాదనే అభిప్రాయం బలంగా వినపడింది. కానీ ఎలాగో నెగ్గుకొచ్చారు. కానీ ఇప్పుడు మూడు పడవల ప్రయాణం చేయాలనుకుంటే దేనికీ పూర్తి న్యాయం చేయలేక మొదటికే మోసం రావచ్చు.
సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్కి లభించే మైలేజ్, పెరిగే ఇమేజ్ రాజకీయాలకు చాలా ఉపయోగపడవచ్చు. కానీ అది సినిమా సూపర్ డూపర్ హిట్ అయితేనే! లేకుంటే విమర్శలు, శాపనార్ధాలు తప్పవు.
ఏపీలో జనసేన తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. కనుక సమర్ధులైన మంత్రులుగా ప్రజలలో మంచిపేరు తెచ్చుకోవడం, రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడంపైనే డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెడితే జనసేన బలమైన పార్టీగా నిలబడగలుగుతుంది. కానీ కీలకమైన ఈ తొలి దశలో ఈవిధంగా రకరకాల ప్రయోగాలు చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది.
అటు సినీ పరిశ్రమలో ఇటు రాజకీయాలలో డక్కామొక్కీలు తిని రాటుతేలిన డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలియవని కాదు. కానీ ఇటువంటి కీలకమైన సమయంలో ఇన్ని ప్రయోగాలు అవసరమా? అని ఆలోచిస్తే మంచిది.




