ఒకప్పుడు దూర్దర్శన్ ఛానల్ మాత్రమే ఉండేది. కనుక అది చూపిందే న్యూస్, అది చూపిందే వినోదం అదే మహాద్భాగ్యం అనుకుంటూ దేశ ప్రజలు దశాబ్దాల పాటు దానినే చూశారు. ఎందుకంటే దానికి ప్రత్యామ్నాయం లేదు కనుక!
తర్వాత ప్రైవేట్ టీవీ ఛానల్స్ వచ్చాయి. అంతే! అందరూ వాటికి షిఫ్ట్ అయిపోయారు. కనుక ఇప్పుడు దూర్దర్శన్ని ఎంతమంది చూస్తున్నారో ఆ సంస్థకే తెలియాలి.
ప్రైవేట్ టీవీ ఛానల్స్ కూడా కొన్నేళ్ళ తర్వాత గాడి తప్పాయి. ఏళ్ళ తరబడిసాగే టీవీ సీరియల్స్, పాత సినిమాలు, ప్రతీ 10-15 నిమిషాలకు పావు గంటసేపు వాణిజ్య ప్రకటనలు, ఏటా చార్జీల పెంపుతో ప్రజల సహనాన్ని పరీక్షించడం మొదలుపెట్టాయి. వాటికి ప్రత్యామ్నాయం లేదు కనుక భరించారు.
తర్వాత కొత్త కొత్త సినిమాలు, వివిధ భాషా చిత్రాలు, వెబ్ సిరీస్లతో ఓటీటీలు వచ్చాయి. దేశంలో చాలా మంది ప్రజలు వాటికి షిఫ్ట్ అయిపోయారు. ఓటీటీలు పుట్టగొడుగుల్లా పెరిగిపోయినప్పటికీ, నేటికీ ప్రైవేట్ టీవీ ఛానల్స్కి అడిక్ట్ అయినవారు లేదా న్యూస్ ఛానల్స్ కోసమో లేదా ఇంటర్నెట్, ఓటీటీల గురించి అవగాహన లేనివారు వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు.
ఒక ఓటీటీ సంస్థ వాణిజ్య ప్రకటనలు జోడించి చేసి అదనంగా డబ్బులు దండుకోగలుగుతోంది. అది చూసి మిగిలిన ఓటీటీ సంస్థలు ఈ దోపిడీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు అదనపు ఆదాయం కోసం ఖర్చులు, లెక్కలు, సమస్యలు, కధలు చెపుతూ అందినకాడికి దండుకుంటున్నాయి.
అవి లేకుండా చూడాలంటే ఏడాది చందాకి అదనంగా మరో రూ.6-700 చెల్లించాల్సిందే అంటూ వసూలు చేసుకుంటున్నాయి. నెల రోజుల చందా చెల్లించి చూస్తామంటే అంగీకరించవు. నచ్చినా నచ్చకపోయినా ఏడాది చందా చెల్లించాల్సిందే… తర్వాత చూసినా చూడకపోయినా మాకు అనవసరం అన్నట్లు ప్రజల ముక్కు పిండి వసూలు చేసుకుంటున్నాయి.
దూర్దర్శన్లో వచ్చే కార్యక్రమాలు చప్పగా ఉన్నందునే దేశ ప్రజలు ప్రైవేట్ టీవీ ఛానల్స్కి మారారు. అవి కూడా వాణిజ్య ప్రకటనలతో సహనం పరీక్షిస్తున్నందునే ఓటీటీలలోకి మారారు. ఇప్పుడు ఓటీటీల పీడింపు మొదలైంది.
ఏదో ఏదోరోజు ఓటీటీలకు ప్రత్యామ్నాయం తప్పక వస్తుంది. అప్పుడు మళ్ళీ ప్రజలందరూ ఓటీటీలకు గుడ్ బై చెప్పేసి దానికి షిఫ్ట్ అవుతారు. కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పట్టించుకునే తీరిక, అసక్తి, ఓపిక లేవు. కనుక ఓటీటీలకు ప్రత్యామ్నాయం వచ్చే వరకు ఓటీటీల దోపిడీని భరించక తప్పదు.






