రాష్ట్ర విభజన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగారు. అమరావతి రాజధాని భూసేకరణలో ఆయన కీలకపాత్ర పోషించారని ప్రభుత్వం భావిస్తే ప్రతిపక్ష వైసీపీ, ప్రజలు అందుకు భిన్నంగా భావించారు.
2019 ఎన్నికలలో టీడీపీ ఓటమికి నారాయణ కూడా ఓ కారణమని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే రాజధాని భూసేకరణలో నారాయణ అవకతవకలకు పాల్పడ్డారంటూ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
కానీ ఆయనని జగన్ ఏమీ చేయలేకపోయారు. బహుశః ఆయన విషయంలో జగన్ అనుమానాలు నిజం కాకపోయి ఉండొచ్చు లేదా నారాయణ తెలివిగా ఈ కేసు నుంచి బయటపడి ఉండొచ్చు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మళ్ళీ ఆయనే ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆయన అమరావతి పునర్నిర్మాణ పనుల గురించి మాట్లాడితే ప్రజలు కూడా చాలా సంతోషించేవారు. కానీ అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించేందుకు 30-40,000 ఎకరాలు సేకరిస్తామంటున్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేయాలని అనుకుంటున్నట్లు చెపుతున్నారు.
పంచాయితీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా చాలా సమర్ధంగా పనిచేసి అందరి మెప్పు పొందుతున్నారు.
ఇదే విదంగా మంత్రి నారా లోకేష్ కూడా తన జిల్లా, నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేసుకుంటున్నారు.
సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన జిల్లా, నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేసుకుంటున్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తన నియోజకవర్గంలో పనులు చకచకా చేసుకుంటున్నారు. వారిని చూస్తున్న ప్రజలు మంత్రులు, ఎమ్మెల్యేలు అంటే ఇలా ఉండాలి.. ఇలా పనిచేయాలని అనుకుంటున్నారు.
కానీ పురపాలకశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నారాయణ ఎంతసేపూ అమరావతిలోనే తచ్చాడుతూ, పదేపదే 30-40,000 ఎకరాల భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ అంటూ మాట్లాడుతున్న మాటలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నానని గ్రహించిన్నట్లు లేదు.
గతంలో ఈవిదంగా మాట్లాడినందునే టీడీపీ రాజకీయంగా ఎదురుదెబ్బతింది. కనుక మళ్ళీ మంత్రి నారాయణ వలననే టీడీపీ పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు.
ఇటు శ్రీకాకుళం, విజయనగరం, అటు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాలలో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
వాటిపై దృష్టి పెట్టాల్సిన పురపాలక మంత్రి నారాయణ, అమరావతిలో భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ అంటూ కాలక్షేపం చేస్తున్నట్లనిపిస్తుంది. పైగా ఇటువంటి మాటలతో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నారనిపిస్తుంది. అవునో కాదో టీడీపీ గ్రామ నేతలు, కార్యకర్తలను అడిగితే తెలుస్తుంది కదా?




