
జమ్ము కశ్మీర్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పర్యాటకుల మతం ఏమిటో అడిగి తెలుసుకొని మరీ కాల్చి చంపడం, మీ మోడీకి చెప్పుకోమని మహిళలకు సూచించడాన్ని మోడీ, అమిత్ షాలు నిజంగానే చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. హోం మంత్రి అమిత్ అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులతో ప్రధాని మోడీ అత్యవసరంగా సమావేశమయ్యి ఈ ఉగ్రదాడి గురించి చర్చించారు.
ఈ దాడికి కొన్ని రోజుల ముందే పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కనుక ఇది ఆయన పధకం ప్రకారమే జరిగి ఉండవచ్చని జమ్ము కశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ అభిప్రాయపడ్డారు. నిన్న జరిగిన దాడికి మేమే బాధ్యులమని జమ్ము కశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ప్రకటించుకున్నప్పటికీ, వారికి అవసరమైన శిక్షణ, ఆయుధాలు అన్నీ సమకూరుస్తున్నది పాక్ ఆర్మీయేనని శేష్ పాల్ వైద్ అభిప్రాయపడ్డారు.
Also Read – అభివృద్ధి కనిపిస్తుంది…సంక్షేమం మొదలయ్యింది..!
పాలస్తీనాలో హమాస్ ఉగ్రవాద సంస్థ కూడా ఇదే విధంగా ఇజ్రాయెల్ పౌరులను లక్ష్యంగా చేసుకొని హత మారుస్తుంటుంది. కానీ అప్పుడు ఇజ్రాయెల్ చేతులు ముడుచుకొని ఖండన ప్రకటనలతో సరిపెట్టకుండా హమాస్ నేతలను గుర్తించి, వారిపై దాడులు చేసి మట్టుబెడుతుంటుంది. కనుక భారత్ కూడా ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పలువురు కోరుతున్నారు.
తెలంగాణ బీజేపి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముగ్గురూ కూడా పాక్పై ప్రతీకారం తీర్చుకోవలసిందే అంటున్నారు. కనుక పాకిస్థాన్ మీద మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read – వైసీపీ నేతలందరూ ఇలా ప్రత్యక్షమయ్యారేమిటి?
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాక్ ప్రేరిత ఉగ్రవాదులు భారత్పై ఎన్నిసార్లు దాడులు చేసినా ఎంతమంది అమయక ప్రజలను పొట్టన పెట్టుకున్నా ఖండన ప్రకటనలతో సరిపెట్టేవారు. కానీ మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ వైపు పాక్ తొంగి చూసినా సహించే ప్రసక్తి లేదన్నట్లు ఆ దేశంతో చాలా కటువుగా వ్యవహరిస్తున్నారు.
కనుక ఇప్పుడూ ఈ ఉగ్రదాడులకు తప్పకుండా పాకిస్థాన్పై ప్రతీకారం తీర్చుకుంటారని అందరూ భావిస్తున్నారు. మరి మోడీ, అమిత్ షాలు ఏం నిర్ణయిస్తారో కానీ పాక్ పాలకులకు కూడా ఈ పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగించేవే!