ఎమ్మెల్యేలంతా తన వైపే ఉన్నారని, మాజీ ముఖ్యమంత్రిగా తనకే అవకాశం ఇవ్వాలని పలుమార్లు గవర్నర్ కలిసి, ‘త్వరలో శుభవార్త వింటారు, అంతా మంచే జరుగుతుంది’ అని మీడియాకు చెప్పిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆశలను నిర్జీవం చేస్తూ గవర్నర్ పళనిస్వామి చేత సిఎంగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా పళనిస్వామికి మరో షరతు కూడా పెట్టారు. 15 రోజుల్లోపున బలనిరూపణలో పాస్ కావాలని చెప్పడంతో, దానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసారు పళనిస్వామి.
ఎక్కువకాలం సాగదీస్తే ఎమ్మెల్యేలు జారిపోయే అవకాశం ఉంది గనుక, వచ్చే సోమవారమే తన బలం నిరూపించుకుంటానని పళనిస్వామి స్పష్టం చేసారు. విషయం మొత్తం ఓ స్పష్టతకు రావడంతో గోల్డెన్ బే రిసార్ట్ నుండి ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చారు. 9 రోజుల నుండి రిసార్ట్ లోనే గడుపుతున్న ఎమ్మెల్యేలు, తాజాగా గవర్నర్ నిర్ణయంతో వెలుగుచూసారు. ఇదిలా ఉంటే, శశికళతో పోటీపడ్డ పన్నీర్ సెల్వంకు చివరి అవకాశం లభించినట్లయ్యింది.
సోమవారం లోపున మరికొంతమంది ఎమ్మెల్యేలు తన వైపుకు తిప్పుకుంటే, బలనిరూపణలో పళనిస్వామిని వెనక్కినెట్టి, సిఎం సీటు నుండి దించే అవకాశం లభిస్తుంది. లేదంటే ఈ సోమవారం దాటితే పన్నీరు ఆశలు పూర్తిగా గల్లంతు అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అన్నాడీఎంకేలో చీలిక వస్తుంది, తద్వారా తాము అధికారంలోకి రావచ్చని భావిస్తున్న డీఏంకే స్టాలిన్ వర్గానికి కూడా సోమవారంతో ఓ స్పష్టత వచ్చేస్తుంది. గత తొమ్మిది రోజుల నుండి ఎలా అయితే ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ వచ్చారో, రాబోయే మూడు రోజులు కూడా అదే పని చేస్తే, పళనిస్వామి వర్గం గండం గట్టెక్కినట్లే భావించవచ్చు.
లేదంటే… సిఎం సీటు మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుంది..!


