ఏపీ సచివాలయంలో ‘కరపత్రం’ సంచలనం!

Andhra Pradesh Employees Shiftజూన్ 27 నాటికి ఏపీ సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ ను వీడి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి తరలి రావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగులకు తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఇక అమరావతి పరిధిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం శరవేగంగా సాగుతుండగా, మరోవైపు ఉద్యోగులకు అవసరమైన వసతి సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. సచివాలయాన్ని ప్రభుత్వం నిర్మిస్తుండగా, వసతి సౌకర్యాల కల్పన మాత్రం ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తోంది.

ఈ మేరకు హైదరాబాదులోని సచివాలయంలో ఏపీ ఉద్యోగులు పనిచేస్తున్న బ్లాకుల్లో ఓ “కరపత్రం” ప్రత్యక్షమై, సంచలనం సృష్టిస్తోంది. విధి నిర్వహణ నిమిత్తం ఉన్న పళంగా హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివస్తున్న ఉద్యోగులకు కావాల్సిన వసతి సౌకర్యాలను ప్రైవేట్ నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. “మీదే ఆలస్యం… వసతి సౌకర్యాలన్నీ సిద్ధం” అంటూ చెబుతూ ప్రత్యక్షమైన సదరు కరపత్రం వైపు ఉద్యోగులు ఆసక్తి కనబరిచారు.

ADVERTISEMENT

అమరావతి పరిధిలోని గ్రామాలు… ప్రత్యేకించి తాత్కాలిక సచివాలయం సమీపంలోని మందడం తదితర గ్రామాల్లో రైతులు, బిల్డర్లు, స్థానిక వ్యాపారులు వసతి సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు అపార్ట్ మెంట్లు సిద్ధమైపోయాయి. సదరు అపార్ట్ మెంట్లలో హాస్టళ్లు వెలిశాయి. కేవలం వసతి మాత్రమే కావాలా? లేదంటే వసతితో పాటు భోజన సౌకర్యం కూడా కావాలా? ఛాయిస్ ఉద్యోగులదే. ఓ ప్రత్యేక తరహా వసతి కావాలన్నా అందించేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి.

వారంలో ఐదు రోజుల పనిదినాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో వారంలో ఐదు రోజుల వసతికి కూడా ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఎసి వసతి కావాలా? నాన్ ఎసి వసతి కావాలా? అంటూ కూడా ఆ కరపత్రం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అలాగే ఇద్దరు, ముగ్గురు కలిసి ఉంటారా? నలుగురైదుగురు ఉంటారా? అన్నది కూడా ఉద్యోగుల ఇష్టమేనట. అయితే ఏ తరహా వసతికి సంబంధించి అదే తరహాలో ఫీజు ఉంటుందంటూ… చెల్లించాల్సి డబ్బును కూడా కరపత్రంలో స్పష్టమైన వివరాలున్నాయి. ఈ కరపత్రం చదువుకుని డిసైడ్ అవ్వాల్సిన వంతు ఉద్యోగులది!

ADVERTISEMENT
Latest Stories