అధికార పార్టీని వీడాలని ఎవరూ అనుకోరు. పైగా వచ్చే ఎన్నికలలో ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ సీట్లు వైసీపీయే గెలుచుకోబోతోందని జగన్ చెపుతున్నప్పుడు, పదవులు, అధికారం కోరుకొనే వారెవరైనా పొమ్మన్నా కూడా పోకుండా వైసీపీ చూరు పట్టుకొని వ్రేలాడుతుండాలి.
కానీ నాలుగైదు నెలల క్రితమే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలో ఉండలేనని బయటకు వచ్చేశారు. ఆయనతో పాటే ఆనం రామనారాయణ రెడ్డి కూడా. ఆ తర్వాత మేకపాటితో కలిసి బయటకు వచ్చేశారు. తాజాగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ ఈరోజు తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
విశాఖలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏమన్నారంటే, “విశాఖలో వైసీపీని బలోపేతం చేసి పార్టీ అభ్యర్ధులను గెలిపించుకొనేందుకు కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు. వారి సమస్యల గురించి నేను దాదాపు ఏడాదిగా జగన్ దృష్టికి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు ఆ అవకాశమీయలేదు. కార్యకర్తల సమస్యలను నేను పరిష్కరించలేకపోతున్నప్పుడు ఇంకా ఈ అధ్యక్ష పదవి దేనికి?
జిల్లా అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వీలులేదంటే ఈ పదవిలో, పార్టీలో కొనసాగి ఏం ప్రయోజనం? అందుకే ఈ పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. నేను టికెట్ కోసమో లేదా వైవీ సుబ్బారెడ్డితో విభేదించో రాజీనామా చేయడం లేదు. నేటికీ వైవీ సుబ్బారెడ్డితో సహా పార్టీలో అందరితో నాకు సత్సంబంధాలే ఉన్నాయి. ఈ విషయం వారికీ తెలుసు. కానీ వైసీపీలో గౌరవం లభించనప్పుడు పదవిలో, పార్టీలో కొనసాగడం అనవసరమని భావించి రాజీనామా చేస్తున్నాను,” అని చెప్పారు.



