తెలుగు సినీ పరిశ్రమలో స్వర్గీయ ఎన్టీఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరి ప్రముఖ హీరోలకు పవర్ ఫుల్ డైలాగ్స్ రాసిన ఘనత పరుచూరి బ్రదర్స్. కానీ, ఒక్క హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం మాకు అవకాశం దక్కలేదు, ఆయనకు కూడా ఓ సినిమాకు రాయాలన్న తాపత్రయాన్ని వెలిబుచ్చారు పరుచూరి గోపాలకృష్ణ. ‘సిద్ధార్ధ’ సినిమా ఆడియో వేడుకకు విచ్చేసిన సందర్భంగా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు పరుచూరి.
గోపాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై కమెడియన్ అలీ కొనసాగింపుగా మాట్లాడిన మాటలు ఆడిటోరియంలో నవ్వులు పూయించాయి. ‘అందరి హీరోలకు మాటలు రాసిన పరుచూరి బ్రదర్స్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మాటలు రాయలేదు. ఆ అవకాశం వారికి నేను కల్పిస్తాను.. పవన్ కల్యాణ్ కు నేను చెబుతాను’ అంటూ అని అలీ అనడంతో ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులంతా పగలబడి నవ్వారు. ముఖ్యంగా, మాటల రచయిత పరచూరి గోపాలకృష్ణ తలకాయ ఊపుతూ మరీ, నవ్వులు చిందించడం ఒక వంతయితే, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా నవ్వడం అసలు విశేషం.
ఇక, ఈ వేడుకకు హాజరైన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ దర్శకుడు బాబీ మాట్లాడుతూ… ‘సిద్ధార్థ’ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ చేసింది చిరంజీవి గారి పుట్టినరోజు అయిన ఆగస్టు 22 నాడు, ఈ చిత్రం ఆడియోనేమో పవన్ కల్యాణ్ గారి పుట్టిన రోజు నాడు విడుదల చేస్తున్నారు కనుక, ఆ ఇద్దరి హీరోల అభిమానుల విషెస్ ఈ చిత్రానికి ఉంటాయని నేను కోరుకుంటున్నాను… అంటూ మెగా అభిమానులను ఆకట్టుకునే ప్రసంగం చేసారు.



