హైదరాబాద్ లో మెట్రో రైలుపై అధికారులు పెంచుకున్న అంచనాలు తప్పాయి. నాగోల్–అమీర్పేట్, మియాపూర్–అమీర్పేట్ మార్గంలో నిత్యం 2.50 లక్షల మంది ప్రయాణిస్తారని భావించగా, ఇందులో సగం మంది కూడా ప్రయాణించడం లేదు. శని, ఆదివారాల్లో రద్దీ రెండు లక్షలు కాగా.. మిగతా రోజుల్లో కనాకష్టంగా లక్ష మంది ప్రయాణించారు.
రానున్న రోజుల్లో సరదాగా వచ్చే వారి సంఖ్య మరింత తగ్గుతుంది కాబట్టి ఈ సంఖ్య ఇంకా తగ్గొచ్చు. ఆయా స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం లేకపోవడం, తాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడమే కారణమని తేలింది. మెట్రో రైలు 22 రోజులుగా పరుగులు తీస్తున్నా ఎంఎంటీఎస్కు ప్రయాణికుల ఆదరణ మాత్రం తగ్గలేదు.
ఇప్పటికి రోజుకు లక్షన్నర మంది ఎంఎంటీఎస్ లోనే ప్రయాణం సాగిస్తున్నారు. ఎంఎంటీఎస్ సేవలు ఐటీ కారిడార్కు సమీపంలో ఉండడం, టికెట్ ధర కూడా తక్కువ కావడంతో దానికి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు అని అధికారులు విశ్లేషిస్తున్నారు. కాకపోతే మెట్రో అంచనాలు తప్పడంతో ఎల్అండ్ టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.



