గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… మోడీపై పొగడ్తల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఏపీలో పెట్టిన సభలో మోడీ కూడా పవన్ ను ప్రశంసించారు. అయితే తాజా పరిణామాలు మాత్రం అందుకు విరుద్ధంగా కనపడుతుండడం విశేషం. కేంద్ర ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో పవన్ పై మోడీ ఇక దృష్టి కేంద్రీకరించడం లేదని పొలిటికల్ వర్గాల లేటెస్ట్ టాక్.
తాజాగా దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు లేఖలు రాసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తెలుగు సినీ ప్రముఖులు దర్శకధీరుడు రాజమౌళి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రిన్స్ మహేష్ బాబులకు కూడా నరేంద్ర మోడీ లేఖలు రాశారు. అలాగే ఇతర సినీ ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ మోహన్ లాల్, అనిల్ కపూర్, హీరోయిన్ అనుష్క శర్మలకు కూడా మోడీ లేఖలు వెళ్ళాయి.
కానీ గతంలో తనకు మద్దతు తెలిపిన, టాలీవుడ్లో అగ్రహీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ కు మాత్రం ఆయన లేఖ రాయకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంటే నరేంద్ర మోడీ ఇక పవన్ ను పూర్తిగా పక్కన పెట్టేసారా? లేక పవన్ ను ఒక సినీ హీరోగా పరిగణించడం లేదా? ‘జనసేన’ అధినేతగా ఒక రాజకీయ పార్టీని దృష్టిలో పెట్టుకునే పవన్ కు ప్రత్యేకంగా లేఖలు రాయలేదా? అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా… పవన్ ను పక్కనపెట్టి మహేష్ కు లేఖ రాయడంపై పవన్ ఫ్యాన్స్ మాత్రం గుర్రుగా ఉన్నారు.


