2014 టీడీపీ ప్రభుత్వంలో కాపు రిజర్వేషన్లు అంటూ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కుల పెద్దగా చెప్పుకోబడే ముద్రగడ పద్మనాభమం ఆ ఉద్యమాన్ని సరైన రీతిలో తీసుకువెళ్లడంలో ఫెయిల్ అయ్యారనే భావన ఆ సామజిక వర్గాలలో కూడా బలంగా నాటుకుపోయింది.
కాపు రిజర్వేషన్ అంటూ ఉద్యమ బాట పట్టిన నేతలు అకస్మాత్తుగా రైలుకి నిప్పుపెట్టారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆ నాటి ప్రమాదంలో ప్రజలందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే తుని ఘటన తో ఆ నాటి టీడీపీ ప్రభుత్వం అనేక నిందలు మోయాల్సివచ్చింది.
ఘటనను ముందుగా కనపెట్టలేకపోయింది ఈ ప్రభుత్వం అంటూ ఒక వైపు, ఈ ఘటనను అడ్డుపెట్టుకుని కుల పెద్ద పై చర్యలకు పాల్పడ్డారంటూ మరోవైపు ఇలా రెండు వైపుల నుండి టీడీపీ ప్రభుత్వానికి చెక్ పడింది. అయితే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన ముద్రగడ తీరు చూస్తుంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగింది అనే వాదనలు అప్పటి టీడీపీ నేతలు వ్యక్తం చేసినప్పటికీ సరైన ఆధారాలు చూపకపోవడంతో ఆ కేసు మరుగున పడిపోయింది.
అయితే 2019 ఎన్నికలలో ప్రభుత్వాన్ని స్థాపించిన వైసీపీ కాపు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు అంటూ తెగేసి చెప్పినప్పటికీ కుల పెద్దగారి మోనం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఇక ఎన్నికలు దగ్గర పడే సమయానికి ముద్రగడ తన కుల పెద్ద ముసుగు తీసి నీలి రంగు ధరించి అదే సామజిక వర్గానికి చెందిన పవన్ పై విమర్శలకు దిగడం, ఆయన ఓటమి కోసం కృషి చేస్తాను అంటూ ప్రకటనలు ఇవ్వడంతో ఈయనగారి రిజర్వేషన్ల ఆసక్తి ఎవరికోసమన్నది తేటతెల్లమయింది.
ఇప్పుడు ఇదే అంశాన్ని జనసేన అధినేత తన పిఠాపురం ఎన్నికల ప్రచారంలో బయటకు తీశారు. ఆ నాడు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన తుని రైలు ఘటన పాపం పూర్తిగా వైసీపీ స్క్రిప్టే అంటూ తేల్చేసారు. నేను ఆవేశంగా మాట్లాడుతాను కానీ విధ్వంసం వైపు వెళ్ళను. ఉద్యమాల పేరు చెప్పి వైసీపీ తెర వెనుక కుట్రలు చేసి కొంతమంది అమాయక కాపు యువతను తన స్వార్దానికి వాడుకుందంటూ వైసిపి పై మండిపడ్డారు.
ఏ ఉద్యమమైనా దారి తప్పితే అందుకు అమాయకులు బలిపీఠం ఎక్కుతారనే సంఘటనకు తుని ఘటనే సాక్షిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని అంశాల మీద తమ అభిప్రాయాన్ని తెలియచేసే ముద్రగడ ఈ తుని ఘటనలో మాత్రం నోరు మెదపడానికి కూడా ఆసక్తి చూపకపోవడానికి వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో ఆ వైసీపీకే ఎరుక అంటున్నారు జనసైనికులు.




