నాలుగున్నరేళ్ల నుంచి ప్రజలు కావాలనుకుంటున్న రాజధాని, వైసీపీ ప్రభుత్వం వద్దనుకుంటున్న రాజధాని “అమరావతి”లోని మందడం గ్రామంలో టీడీపీ- జనసేన అధినేతలు సంక్రాతి వేడుకలు జరుపుకోవడనికి సిద్ధమయ్యారు. ఈ రోజు రాత్రి ఇద్దరు అధినేతలు డిన్నర్ మీట్ కార్యక్రమం లో పాల్గొని భవిష్యత్ కార్యక్రమాల మీద చర్చించనున్నట్లు సమాచారం.
సంక్రాతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు తన మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను డిన్నర్ కు ఆహ్వానించారు. పొత్తులో భాగంగా ఎన్నికలకు సిద్దమైన ఇద్దరు అధినేతలు ఉమ్మడి మానిఫెస్టో అమలు విధానాలను, ఎవరు ఎన్ని స్థానాలలో పోటీచేయాలో, ఎవరిని అభ్యర్థులుగా ఎన్నుకోవాలో చర్చించి తోలి జాబితాను ఖరారు చేయనున్నారు.
అలాగే రేపు ఉదయం జరిగే భోగి మంటల కార్యక్రమంలో పాల్గొని వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన ‘ప్రజా వ్యతిరేక జీవోలను’ భోగి మంటలలో వేసి ఉమ్మడి నిరసన తెలియచేయనున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలకు వచ్చిన పాజిటివ్ బజ్ ను కొనసాగిస్తూ ప్రభుత్వం పై ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యారు ఇరు పార్టీల అధినేతలు. రానున్న రెండు నెలలు ఏపీలో రాజకీయ పార్టీల ప్రచార హోరు ఆకాశం లో ఎగిరే పతంగుల మాదిరి పైపైకి ఎగబాకుతాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
ఇంచార్జ్ ల మార్పు ప్రక్రియతో వైసీపీ లో మొదలైన “నిరసన మంటలు”, అధినేత జగన్ పై మొదలైన “తిరుగుబాటు పతంగులు”, సీట్లు దక్కని నేతలలో “పొంగుతున్న ఆవేశాలతో” వైసీపీ పార్టీ కి సంక్రాంతి పండుగ కొన్ని రోజుల ముందే వచ్చినట్లయింది. మరి ఈ మంటలను చల్లబరుస్తు, ఎగిరిన తిరుగుబాటు పతంగులు అదుపుచేస్తూ, నేతలలో పొంగుతున్న ఆవేశాలను కట్టడి చేస్తూ జగన్ ముందుకెళ్లాలని చూస్తుంటే ఆ ద్వారాలను మూయడానికి బాబు, పవన్ లు సిద్ధమయ్యారు.




