గత కొన్ని గంటలుగా మీడియా వర్గాలలో ఓ సంచలన వార్త హల్చల్ చేస్తోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న సినీ నటి రోజా, త్వరలో పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీలోకి వెళ్ళబోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో పవర్ స్టార్ అభిమానుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. పొలిటికల్ వర్గాల్లో రోజాకున్న ‘ఇమేజ్’ తెలియనిది కాదు. నాడు టిడిపిలోకి చేరగానే చంద్రబాబుకు యాక్సిడెంట్ కావడం, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్దామనుకునే సరికి ఏకంగా వైఎస్సార్ మరణించడం, జగన్ పక్కకు వెళ్ళగానే జైలు పాలు కావడం… తదితర సంగతులు తెలిసినవే.
ఈ సంఘటనలతో ప్రత్యక్షంగా రోజా ప్రమేయం ఉన్నా, లేకున్నా గానీ, రోజా అడుగుపెట్టిన తర్వాతే ఇవన్నీ చోటు చేసుకోవడంతో… పొలిటికల్ వర్గాల్లో ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర పడింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రోజా గెలిచినప్పటికీ, వైసీపీ ఓడిపోవడానికి కారణం కూడా ఆమె ఆ పార్టీలో ఉండడమే అంటూ ప్రచారం చేసారు. సెంటిమెంట్స్ విశ్వసించే సాధారణ ప్రజానీకంలోకి కూడా రోజా విషయం చాలా బలంగా వెళ్లిపోయింది. దీంతో ఆమె పార్టీ మారుతోంది అంటే ఇతర నాయకుల మాదిరి అది చిన్న వార్త కాదు.
అందుకే మీడియా వర్గాలు ప్రసారం చేసిన వెంటనే రోజా కూడా తగిన వివరణ ఇచ్చుకున్నారు. ఇది విన్న తర్వాత ‘జనసేన’ పార్టీ అభిమానులు ఊపిరి పీల్చుకుని ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఎక్కడ జనసేనలోకి వచ్చేస్తుందో అని కంగారుపడిన అభిమాన వర్గానికి ఊరటనిచ్చే విధంగా తాను ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని కుండబద్దలు కొడుతూ చెప్పారు. తన జీవితకాలం మొత్తం వైసీపీతోనే గడిపేస్తానని చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది.
తల, తోక లేని జనసేన పార్టీలోకి తాను వెళ్ళేదేంటి… అంటూ రోజా ఒకింత జనసేనను కించపరిచే వ్యాఖ్యలు చేసినప్పటికీ, అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. జనసేనలోకి అడుగుపెడితే పవర్ స్టార్ పరిస్థితి ఏం కానూ? అంటూ కలత చెందిన అభిమానగణానికి ఓ తీపి కబురును అందించింది రోజా. దీంతో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేఫ్… తమ పార్టీ జనసేన కూడా సేఫ్… అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రోజా లెగ్ పవర్… పవన్ ఫ్యాన్స్ ను అలా ఆనందించేలా చేస్తోందన్న మాట..!



