ఎంత ఎదిగినా చాలా సింపుల్ గా పవన్ కళ్యాణ్ ఉంటారన్న విషయం బహిరంగమే. నిజానికి సినిమాలలో ప్రదర్శించే నటన కంటే కూడా ఈ రకమైన ప్రవర్తనతోనే చాలా మంది అభిమానులను పవన్ తన సొంతం చేసుకున్నారు. ఇది వివాదానికి తావు లేని అంశం మరియు జగమెరిగిన సత్యం. దీనిని కూడా ‘జనసేన’ పబ్లిసిటీ కోసం వినియోగించాలా? అంటే బహుశా కొన్ని కొన్ని సందర్భాలలో తప్పు లేదేమో గానీ, మరీ బాత్రూంల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి.
బహుశా ఇలా పబ్లిసిటీ చేయమని పవన్ కళ్యాణ్ కూడా సూచనలు చేసి ఉండరు. ‘జనసేన’ యువ టీం ప్రదర్శించే అత్యుత్సాహానికి ఇదొక నిదర్శనగా పేర్కొనవచ్చు. ఇటీవల తిరుమల పర్యటించిన సందర్భంలో పవన్ వినియోగించిన కాటేజ్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ‘శాతగ్ని’ టీం పోస్ట్ చేసింది. పవన్ ఉన్న రూమ్ తో పాటు బాత్రూం ఫోటోలను కూడా పోస్ట్ చేయడం, ఈ విమర్శలకు దారి తీసింది. దీంతో నెటిజన్లకు కూడా శాతగ్ని టీం మంచి ఆహారాన్ని అందించినట్లయ్యింది.
రాజకీయాలలో పబ్లిసిటీ అవసరమే, నిజానికి కావాలి కూడా! కానీ మరీ ఈ రకపు పబ్లిసిటీ ఏ రాజకీయ నాయకుడు కోరుకోడు! ఏ అభిమాని కూడా దీని గురించి గొప్పగా చెప్పుకోరు. కనీసం ఈ మాత్రం అవగాహన లేని సభ్యులను ఎన్నుకున్నందుకు పవన్ మరోసారి తన సోషల్ మీడియా టీంపై పునరాలోచనలు చేయాలేమో! విశేషం ఏమిటంటే… పవన్ తిరుమలలో బస చేస్తే… వారి శాతగ్ని టీం మాత్రం పవన్ ను ఏకంగా విశాఖ తీసుకువెళ్ళింది. ఈ స్థాయిలో జనసేన సోషల్ మీడియా పని చేస్తోంది మరి!



