తెలంగాణ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకొన్నందుకు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయాల్సి వస్తోంది. అదేమీ తప్పు కాదు. అయితే ప్రచారానికి బయలుదేరిన తర్వాత, బీజేపీ తన భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్కి గురి పెడుతోందని పవన్ కళ్యాణ్ గ్రహించిన్నట్లే ఉన్నారు.
నిన్న హనుమకొండలో బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించవలసి వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ చాలా ఆచితూచి మాట్లాడవలసి రావడమే ఇందుకు నిదర్శనం.
తెలంగాణ ప్రజల పోరాటలతో ఏర్పడిన రాష్ట్రమంటే తనకు చాలా గౌరవమని, వారి పోరాట స్పూర్తితోనే తనను ధైర్యంగా ఏపీలో ఆరాచకపాలన చేస్తున్న వైసీపి ప్రభుత్వంతో పోరాడుతున్నానని అన్నారు. బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇంత అవినీతిని చూసి సహించలేకనే ప్రజల మద్యకు వచ్చానని పవన్ కళ్యాణ్ సర్ధిచెప్పుకొన్నారు.
షరా మామూలుగా ప్రధాని నరేంద్రమోడీ అంటే తనకు ఎందుకు అంత గౌరవమో పవన్ కళ్యాణ్ చెప్పుకొని ఆ తర్వాత బీజేపీ ఎన్నికల వ్యూహామైన ‘బీసీ ముఖ్యమంత్రి’ గురించి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడితే దళిత ముఖ్యమంత్రి అవుతారని ఆశ పడ్డానని కానీ అది నెరవేరనే లేదన్నారు. ఇప్పుడు బీసీలకు ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది కనుక బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రసంగం ముగించారు.
పవన్ కళ్యాణ్ ఏపీలో వారాహి యాత్రలు చేస్తున్నప్పుడు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం, వైసీపి మీద ఏ స్థాయిలో చెలరేగిపోతారో, వాటికి ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కొంటున్నారో అందరికీ తెలుసు. కానీ తెలంగాణలో ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేయకపోవడానికి కారణాలు అందరికీ తెలుసు.
హైదరాబాద్లోనే సినీ పరిశ్రమ ఉంది. బిఆర్ఎస్, బీజేపీలు శత్రువులులా నటిస్తూ పైకి కత్తులు దూసుకొంటున్నప్పటికీ వాటి మద్య బలమైన బంధం ఉందని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కనుక! కానీ ఏవో ‘విశాల ప్రయోజనాల కోసం’ బీజేపీ, బిఆర్ఎస్ మద్య తలదూర్చినందుకు, నాలుగు ముక్కలు మాట్లాడాలి కనుక మాట్లాడారనుకోవచ్చు. కానీ రేపు ఏపీలో కూడా బీజేపీ కోసం ఇలాగే చేయాల్సి వస్తే?




