ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. రెండు పార్టీలు ఈ ఎన్నికలు తమకు చావోరేవో అన్నట్టు భావించి తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరోవైపు జనసేన తన తొలి ఎన్నికలలో ఎలాగైనా ప్రభావం చూపించాలని ఆరాటపడుతుంది. పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కింగ్ అయ్యే అవకాశం లేకపోయినా కనీసం కింగ్ మేకర్ అవ్వాలని ఆయన ఆరాటపడుతున్నారు.
అయితే జనసేనకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ పార్టీ గాజు గ్లాసు గుర్తుని పోలిన గుర్తులను ఎన్నికల సంఘం కొందరు ఇండిపెండెంట్లకు కేటాయించింది. బక్కెట్ గుర్తు, కప్ సాసర్ గుర్తులు రెండు గాజు గ్లాసును పోలి ఉన్నాయి. నిరక్షరాశ్యులు, వృద్ధులు దీని వల్ల పొరపాటు పడే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం గుర్తుల పక్కన అభ్యర్థుల పేర్లు కూడా రాస్తున్నా ఎన్నికలలో గుర్తులే కీలకం. ఇప్పటికే గుర్తులు కేటాయించేయడంతో ఇప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితి.
చివరి నిముషం వరకూ దీని మీద ఆ పార్టీ శ్రద్ధ పెట్టలేదు. ఒకపక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీ గుర్తుపై ఎన్నికల సంఘం వద్ద పోరాడుతుంటే జనసేన నాయకులు చోద్యం చూశారు. ఒకవేళ చాలా నియోజకవర్గాలలో గనుక ఈ గుర్తులు కేటాయించి ఉంటే దీనికి ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. ఈ నెల 11న పోలింగ్ జరగబోతుంది. మే 23న ఫలితాలు విడుదల అవుతాయి. అంటే ఫలితాల కోసం దాదాపుగా నెలన్నర నిరీక్షణ.



