రీ రిలీజులు మొహం మొత్తేస్తున్నాయని అనుకుంటున్న టైంలో రేపు విడుదల కాబోతున్న ఖుషి బుకింగ్స్ ట్రెండ్ చూసి ట్రేడ్ షాక్ అవుతోంది. ఒక్క నైజామ్ లోనే కేవలం అడ్వాన్స్ ఆన్ లైన్ అమ్మకాల ద్వారా కోటి రూపాయలు వసూలయ్యిందనే వార్త సంచలనం రేపుతోంది. లెక్కల విషయం పక్కనపెడితే ఇంతే హడావిడి పోకిరి, జల్సాలకూ జరిగింది కానీ ఖుషి హైప్ మాత్రం వేరే లెవెల్ అనిపిస్తోంది. ఇదేదో ఎక్కడా దొరకని క్లాసిక్ కాదు. ఓటిటి అకౌంట్ లేకపోతే యూట్యూబ్ లో HD చూసేంత ఫ్రీగా అందుబాటులో ఉంది.
మరి ఇంత క్రేజ్ ఎందుకనేదానికి కారణాలున్నాయి. పవన్ అభిమానుల్లో అధిక శాతం యువతేనన్న సంగతి తెలిసిందే. పాతిక వయసు లోపే మెజారిటీ భాగం. వీళ్ళలో చాలా మంది 2002లో ఇది థియేటర్లో వచ్చిన టైంకి అసలు పుట్టే ఉండరు. దాని యూఫోరియా, వసూళ్లు, వారాల తరబడి హౌస్ ఫుల్ బోర్డులు ఇవన్నీ పాత పత్రికలు, వెబ్ సైట్లలో ప్రత్యేక వ్యాసాలు చదవడమే తప్ప ఆ అనుభూతిని ప్రత్యక్షంగా పొందలేకపోయారు. 2003లో ఇంకోసారి రీ రిలీజ్ చేశారు కానీ ఆ తర్వాత నిర్మాత ఏఎం రత్నం మళ్ళీ వదిలే ఆలోచన చేయలేదు.
ఇన్నేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ మీద ఖుషిని ఎంజాయ్ చేసే అవకాశం దక్కడంతో ఫ్యాన్స్ ఎగ్ జైట్మెంట్ ఫీలవుతున్నారు. పవన్ కెరీర్ మొత్తంలో చేసిన ఇరవై ఏడు సినిమాల్లో అత్యంత స్టైలిష్ గా యూత్ ఫుల్ గా కనిపించింది ఖుషిలోనే. బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ , సిద్దు సిద్దార్థ్ రాయ్ అంటూ తనదైన శైలిలో చెప్పే డైలాగులు ఇవన్నీ ట్రెండ్ సెట్టింగ్ కు దారి తీశాయి. వాటిని అప్పట్లో ఎక్స్ పీరియన్స్ చేసిన యూత్ ఇప్పుడు మధ్య వయసు దాటారు. మరోసారి దాన్ని థియేటర్లోనే పొందాలనుకుని వాళ్ళూ టికెట్లు కొనేస్తున్నారు.
ఇదంతా మళ్ళీ ఇంకో సినిమాకు రిపీట్ అవుతుందని చెప్పలేం. జనవరి 7న ఒక్కడు వస్తోంది. ఇప్పుడీ ట్రెండ్ ని నిశితంగా గమనిస్తున్న మహేష్ బాబు ఫ్యాన్స్ ఖుషిని బ్రేక్ చేయాలనుకుంటే ఇదే సీన్ రిపీట్ అవుతుంది. శతదినోత్సవాలు పోయి ఫైనల్ రన్ లు రోజుల్లోకి వచ్చేసినా సరే అభిమానుల్లో రికార్డుల వ్యామోహం మాత్రం అలాగే ఉండిపోయింది. కాబట్టి ఒక్కడుకి ఇంతే రచ్చ జరిగినా ఆశ్చర్యం లేదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే కొత్తగా వచ్చిన రిలీజులెవీ కనీసం సగం హాళ్లు కూడా నింపలేని పరిస్థితి ఉంటే ఖుషికి మాత్రం టికెట్లు సోల్డ్ అవుట్ కావడం.



