వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యవహారంలో తెలంగాణ సిఎం కేసీఆర్ వేలుపెట్టడంతో దానిపై మళ్ళీ అందరి దృష్టి పడింది లేకపోతే గుట్టుచప్పుడు కాకుండా అమ్మకం జరిగిపోయేది. అయితే ఈ వ్యవహారంపై నేడు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ప్రక్రియ యదాతధంగా సాగుతుందని స్పష్టం చేసింది.
గురువారం ఉదయం విశాఖ వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగన్ సింగ్ కులస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ముందుకు వెళ్ళడం లేదని చెప్పారు. దాంతో ప్లాంట్లో ఉద్యోగులు ఎంతో సంబరపడ్డారు. మా పోరాటం వలననే కేంద్రం వెనక్కు తగ్గిందంటూ తెలంగాణ మంత్రులు వెంటనే ఈ ‘క్రెడిట్ క్లెయిమ్’ చేసుకొన్నారు.
బహుశః అందుకేనేమో ఫగన్ సింగ్ కులస్తే మళ్ళీ మాట మార్చి “సహాయ మంత్రినైన నేను కేంద్రమంత్రివర్గం తీసుకొన్న నిర్ణయాన్ని ఎలా అడ్డుకోగలను? ప్రైవేటీకరణను ఎలా ఆపగలను?”అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ప్లేన్ ఎక్కేశారు. దాంతో మళ్ళీ తెలంగాణ మంత్రులు కూడా మాట మార్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపేసేవరకు మా పోరాటం సాగుతుందని స్టేట్మెంట్తో ఈ రాజకీయ యుద్ధానికి కామా పెట్టి, నేడు హైదరాబాద్ 125 అడుగుల డా.అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బిజీ అయిపోయారు.
ఇక ఏపీ పార్టీల విషయానికి వస్తే వైసీపీకి అంతమంది ఎంపీలు ఉన్నప్పటికీ ఈ వ్యవహారంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేని పరిస్థితిలో ఉంది. టిడిపి ప్రతిపక్షంలో ఉంది కనుక అది అడిగినా వినే నాధుడు లేడు. బిజెపితో కలిసి పనిచేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్దపడుతున్నారు కనుక ఆయన ఇప్పుడు కేంద్రాన్ని గట్టిగా నిలదీయవలసి ఉంది. కానీ ఆయన కూడా ట్విట్టర్లో ఓ లెటర్ పెట్టేసి చేతులు దులుపుకొన్నారు!
కనుక వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీలో అడ్డుకొనే పార్టీలు ఏవీ లేవని మరోసారి స్పష్టమైంది కనుకనే కేంద్రం ఏమాత్రం సంకోచించకుండా కేంద్ర సహాయమంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఢిల్లీ చేరుకోగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నామని ప్రకటించిందనుకోవచ్చు.



