భీమవరం సభలో జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాబు అరెస్టు నేపథ్యంలో రాజమండ్రి వేదికగా టీడీపీ తో పొత్తు ప్రకటన చేసిన పవన్ వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వను అంటూ మరోసారి హామీ ఇచ్చారు.
అయితే అప్పటికే బీజేపీ పార్టీ తో పొత్తులో ఉన్న జనసేన, బీజేపీ పార్టీ నిర్ణయంతో సంబంధం లేకుండా టీడీపీ తో పొత్తు ప్రకటన షురూ చేసింది. అక్కడి నుంచి ఈ రెండు పార్టీల నేతలు ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టి ఎన్నికలకు సిద్ధమయ్యారు. అయితే ఈ రెండు పార్టీల కూటమికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని భావించిన పవన్ బీజేపీ తో రాయబారాలు కొనసాగించారు.
151 మంది ఎమ్మెల్యే లు, వేలాదిమంది ప్రయివేట్ సైన్యంగా ఉన్న వాలంటీర్లు, అధికార పార్టీ కనుసన్నలలో నడిచే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ అధికారులు, దాడులనే నమ్ముకుని ముందుకెళ్తున్న వైకాపా నాయకులను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీ సహకారం ఉండాల్సిందే అని బలంగా నమ్మారు పవన్.
ఈ నేపథ్యంలోనే జనసేన – టీడీపీ కూటమిలో బీజేపీ ని కూడా చేర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసానని, దాని వలన జాతీయ నాయకులతో ఎన్నో చివాట్లు తినాల్సి వచ్చిందని, ఎన్ని తిట్టిన భరించి చేతులు జోడించి దండాలు పెట్టి రాష్ట్రం నాశనం అయిపోతుంది అని చెప్పి జాతీయ నాయకులను ఒప్పించానని భీమవరం సభలో తన కష్టాన్ని, ఆవేదనను అర్ధం చేసుకోవాలంటూ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసారు పవన్.
ఇదంతా తనకోసమో, తన పార్టీ జనసేన గెలుపు కోసమో చేయలేదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఇన్ని అవమానాలను తట్టుకుని ముందుకు వెళుతున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచక పాలన నుండి ప్రజలను, రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నట్లు తెలియచేసారు. అప్పులు చేసి బటన్ నొక్కడం కాదు అభివృద్ధి చేసే బటన్ నొక్కగలిగితే అప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి జరిగినట్లు..ఇటువంటి అభివృద్ధి చేసి చూపించడానికి టీడీపీ – జనసేన ప్రభుత్వం రావాలి.
తండ్రి సంపాదించిన ఆస్తిలో సొంత చెల్లికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా చెల్లిని బాధపెడుతున్న జగన్ ప్రజలకు వాటా ఇస్తాడా..? ఒక్కసారి ఆలోచించాలి. సొంత చెల్లి పై కూడా నీచంగా రాజకీయాలు చేస్తున్న జగన్ రాష్ట్రంలోని ఆడపడుచులకు న్యాయం చేయగలుగుతారా..? ఇటువంటి రాక్షస పాలన నుండి ఏపీని కాపాడుకోవడానికి అందరు కలిసికట్టుగా మందుకు రావాలి అంటూ పిలుపునిచ్చారు పవన్.
ఒక స్టార్ హీరోగా ఉంటూ.., ప్రజలలో ఇంత ఆదరాభిమానాలు ఉన్న నేను కూడా ఈ రాష్ట్ర క్షేమం కోసం పార్టీల మధ్య పొత్తు కుదర్చడానికి జాతీయ నాయకులతో ఎన్నో మాటలు పడ్డాను, బాధపడ్డాను. పొత్తు కుదిరిన తరువాత ఇరు పార్టీల నేతలు కొన్ని త్యాగాలకు సిద్ధం కావాల్సిందే. రాష్ట్ర శ్రేయస్సు కోసం మీరు కూడా ఇటువంటి చిన్నా చితక భావోద్వేగాలకు లోనుకాకుండా ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి అంటూ సూచనలు చేసారు.




