జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన జనసేన పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కపాసకుర్ది తీరప్రాంతంలో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. “నేను పదవి కోరుకోలేదు… పని చేయాలని అనుకున్నా. నేను అనుకుంటే సీఎం ఆవుతాను. యువత మద్దతు, పెద్దల ఆశీస్సులుంటే 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం,” అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఇదే సంధర్భంగా కులాలమీద కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “కులాలను ఒక్కటి చేద్దాం… మిగతా వాళ్లలాగా కులాలను విడదీసి పబ్బం గడపను… ప్రజాసేవే మా పార్టీ సిద్ధాంతం,” అని పవన్ కళ్యాణ్ అన్నారు. అదే విధంగా ప్రస్తుత జనసేన పోరాట యాత్ర కాకుండా మరో యాత్రకూడా చెయ్యబోతున్నట్టు ఆయన ప్రకటించారు.
“ఇది సమస్యల అవగాహన పర్యటన మాత్రమే… మలివిడత పర్యటనలో సమస్యల పరిష్కారం గురించి చెబుతా,” అని పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో భాగంగా పవన్కల్యాణ్ తొలి దశలో 45 రోజుల పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో తిరుగుతారు.



